ఉక్రెయిన్లో రష్యా దారుణాలు : గుట్టలు గుట్టలుగా శవాలు.. 300 మృతదేహాల సామూహిక ఖననం
ఉక్రెయిన్లో రష్యా సైనికులు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు. వారు చేసిన అకృత్యాలు , విధ్యంసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీధులు శవాల దిబ్బలుగా మారాయి. ఏ వీధిలో చూసినా గుట్టలు గుట్టలుగా శవాలు, సామూహిక ఖననాల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. రాజధాని కీవ్ ప్రాంతం నుంచి రష్యా దళాలు వైదొలిగిన తర్వాత ఉక్రెయిన్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. అక్కడి దృశ్యాలు చూస్తే హృదయాలను ద్రవిస్తున్నాయి. కీవ్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచాలో దృశ్యాలు చూస్తే రష్యా విధ్వంసకర తీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
శవాల కింద ల్యాండ్మైన్స్..
కొన్ని చోట్ల మృతదేహాల కింద ల్యాండ్మైన్స్ కూడా పెట్టారని, శవాలను తొలగించగానే అవి పేలుతున్నాయని ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. దీంతో బుచాలో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది.
అంతే కాకుండా 300 మంది పౌరుల మృతదేహాలను సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. మరో చోట 120 మృతదేహాలు లభించాయని చెప్పారు. రష్యా సృష్టించిన మారణకాండ మాటల్లో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
పౌరులపై అత్యంత కిరాతకంగా కాల్పులు
రష్యా సేనలు పౌరులపై అత్యంత కిరాతంగా కాల్పులు జరిపాయని బుచో మేయర్ అనతోలి ఫెడొరక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని నేలపై పడుకోబెట్టి , చేతుల్ని వెనక్కి కట్టి తలవెనుక భాగాన కాల్చినట్లు చెప్పారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వారిని సైతం మాస్కో బలగాలు పొట్టన బెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కీవ్ శివార్లలో అనే గ్రామాల్లో ఇంకా సందర్శించలేదని, సహాయక చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. బుచా, హోస్టోమెల్, ఇర్పిన్ నగరాలను సహాయక బృందాలతో పాటు ప్రజా ప్రతినిధులు సందర్శించారని చెప్పారు.
రష్యా మారణకాండపై ఐసీసీకి ఫిర్యాదు
రష్యా సృష్టించిన మారణకాండపై అంతర్జాతీయ నేరాల న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ కు తమ ప్రతినిధులను వెంటనే పంపాలని ఐసీసీని కోరింది. అంతర్జాతీయంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, మానవహక్కుల సంఘాలు వీలైనంత త్వరగా ఉక్రెయిన్ సందర్శించాలని విజ్ఞప్తి చేసింది రష్యా అరాచకాలను గుర్తించాలని , ఆలస్యం జరిగితే ఆధారాలు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్ నగరాల్లో లూటీలు, అత్యాచారాలు, దారుణ హత్యలకు పాల్పడిన రష్యాపై అంతర్జాతీయ సమాజం మరిన్ని ఆంక్షలు విధించాలని మరోసారి విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ను సర్వనాశనం చేసిందని మండిపడింది.