ఉక్రెయిన్తో భీకర యుద్ధం వేళ..తొలిసారి దాటిన పుతిన్: భారత్ ఫ్రెండ్తో భేటీ: రెడ్ కార్పెట్
టెహ్రాన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది..తిప్పి కొడుతోంది.

తూర్పు ప్రాంతం రష్యా ఆధీనంలో..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

సుదీర్ఘకాలంగా..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

దౌత్య సంబంధాలపై..
ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇరాన్లో పర్యటిస్తోన్నారు. యుద్ధం ఆరంభమైన తరువాత ఆయన దేశం దాటడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటన సందర్భంగా ఆ దేశ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖెమెనె, దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న దౌత్య సంబంధాలు, ఆర్థిక, వాణిజ్య అంశాల గురించిన అంశాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.

ఇరాన్ హామీలు..
చమురు, సహజవాయు ఎగుమతుల గురించి మాట్లాడారు. అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ అండగా ఉంటుందని, ఎలాంటి సహాయ, సహకారాన్నయినా అందించడానికి సిద్ధంగా ఉంటుందని ఖమెనె స్పష్టం చేశారు. ఈ పర్యటన సందర్భంగా పుతిన్.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డగాన్తోనూ భేటీ కావాల్సి ఉంది. ఆయా దేశాలతో రష్యా సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది.

పవర్ ఫుల్ డ్రోన్ల కోసమా?
ఇరాన్ నుంచి శక్తిమంతమైన డ్రోన్లను కొనుగోలు చేయడానికే పుతిన్ ఈ పర్యటనను తలపెట్టారనే వార్తలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్పై మానవ రహిత దాడులను చేపట్టడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారని, ఇందులో భాగంగా డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారనే ప్రచారం చోటు చేసుకుంది. దీన్ని క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదనలు గానీ, ఒప్పందాలు గానీ చర్చకు రాలేదని స్పష్టం చేసింది.

రెడ్ కార్పెట్..
ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్.. ఇరాన్లో పర్యటించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ పర్యటనలో ఎర్డగాన్తోనూ భేటీ కానున్నారు. అంతకుముందు- రాజధాని టెహ్రాన్కు చేరుకున్న పుతిన్కు ఇరాన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మెహ్రాబాద్ ఎయిర్ పోర్ట్లో రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఇరాన్ పెట్రోలియం శాఖ మంత్రి జవాద్ ఓవ్జీ.. విమానాశ్రయంలో పుతిన్కు స్వాగతం పలికారు.












Click it and Unblock the Notifications