చైనా అధ్యక్షుడితో పుతిన్ భేటీ: భారత్ ఏం చేయబోతోంది..?
మాస్కో: ఆసియాలో రెండు శక్తిమంతమైన దేశాలు రష్యా-చైనా అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్పింగ్ త్వరలో భేటీ కానున్నారు. ఫేస్ టు ఫేస్ ఈ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ ఇద్దరు నేతల అత్యున్నత స్థాయి సమావేశానికి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఉజ్బెక్లోని సమర్కండ్లో వారిద్దరూ భేటీ కానున్నారు. ఉక్రెయిన్తో సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుతిన్- గ్ఝి జిన్పింగ్ను కలుసుకోబోతోండటం ఆసక్తి రేపుతోంది.
కోవిడ్ తరువాత దేశం దాటనున్న జిన్పింగ్..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత చైనా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు బయలుదేరబోతోండటం ఇదే తొలిసారి కానుంది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. సమర్కండ్లో ఏర్పాటు కానున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజన్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కానున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సమ్మిట్ షెడ్యూల్ అయినట్లు రష్యన్ న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ తెలిపింది. చైనాలోని రష్యా రాయబారి ఆండ్రూ డెనిసొవ్ పేరును ఉటంకించింది.
ఉక్రెయిన్ యుద్ధం తరువాత..
ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించిన తరువాత వ్లాదిమిర్ పుతిన్.. జిన్పింగ్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. యుద్ధం విషయంలో చైనా తటస్థంగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. జపాన్, అమెరికా, ఆస్ట్రేలికా, కెనడా సహా యురోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సభ్యదేశాలన్నీ యుద్ధాన్ని వ్యతిరేకిస్తోన్నాయి. రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలను విధించాయి. నిషేధాజ్ఞలను అమలు చేస్తోన్నాయి.
షాంఘై భేటీలో..
ఈ పరిణామాల మధ్య పుతిన్-జిన్పింగ్ భేటీ కాబోతోన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో ముఖాముఖిగా భేటీ కాబోయే ఈ ఇద్దరు నేతలు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటివరకు దీనికి సంబంధించిన అజెండా ఖరారు కాలేదని చైనాలోని రష్యా రాయబారి చెప్పారు. సుదీర్ఘ విరామం అనంతరం వారిద్దరూ కలుసుకోబోతోండటంతో ఓ పూర్తిస్థాయి అజెండాను రూపొందించనున్నామని, అన్ని అంశాలు ఇందులో ప్రస్తావనకు వస్తాయని చెప్పారు.
ఎలా స్పందిస్తుంది?.
ఈ భేటీ పట్ల భారత్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. భారత్కు సుదీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉంటూ వస్తోంది రష్యా. దేశ రక్షణకు అవసరమైన పరికరాలు, యుద్ధ సామాగ్రిని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది భారత్. ఉక్రెయిన్తో యుద్ధ విషయంలోనూ తటస్థవైఖరినే అనుసరిస్తోంది. చైనా పరిస్థితి అలాక్కాదు. సరిహద్దుల్లో తరచూ చైనా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తోంది.
భారత్ ఏం చేయబోతోంది..?
లఢక్ మొదలుకుని అరుణాచల ప్రదేశ్ వరకు 3,000 కిలోమీటర్లకు పైగా గల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుపుతోన్నాయి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సరిహద్దుల్లో గ్రామాలకు గ్రామాలను నిర్మిస్తోన్నాయి. కొత్తగా రోడ్లను నిర్మించుకుంటోన్నాయి. లఢక్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద చైనా సృష్టించే ఉద్రిక్తలకుక అంతు ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో పుతిన్.. చైనా అధ్యక్షుడితో భేటీ కానుండటాన్ని భారత్ నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది.