టాక్ ఆఫ్ సెంచరీ: ట్రంప్-కిమ్ భేటీపై ద.కొరియాలో సంబరం, ‘అధ్యక్షుడికి నిద్రలేదు’
సియోల్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. శాంతి చర్చల కోసం జరిగిన వీరి భేటీపై దక్షిణకొరియా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ భేటీని 'టాక్ ఆఫ్ ది సెంచరీ, టాక్ ఆఫ్ ది హిస్టరీ' అని కొనియాడింది.
షాక్: ట్రంప్తో భేటీకి టాయ్లెట్ వెంట తెచ్చుకున్న కిమ్, ఆ భయమే కారణమా?
నూతన శకం
ట్రంప్-కిమ్ భేటీ శాంతి స్థాపనకు నూతన అధ్యయాన్ని లిఖించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ వ్యాఖ్యానించారు. ట్రంప్-కిమ్ భేటీ విజయవంతమైందని నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనలో నూతన శకం ప్రారంభమవుతోందని అన్నారు.
అధ్యక్షుడికి నిద్రలేని రాత్రి
కాగా, ట్రంప్-కిమ భేటీపై ఉన్న ఆసక్తి వల్ల మూన్ జే-ఇన్ సోమవారం రాత్రంతా నిద్రలేకుండా గడిపారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రెసిడెన్షియల్ బ్లూ హౌస్లో తన కేబినెట్ మంత్రులతో కలిసి మూన్ ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారని తెలిపారు.
ద.కొరియన్ల సంబరం
అధ్యక్షుడు ఇలావుంటే.. దక్షిణకొరియా ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోవడం గమనార్హం. సియోల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన టెలివిజన్లో ట్రంప్-కిమ్ భేటీని సియోల్ వాసులు వీక్షించారు. ట్రంప్-కిమ్ కరచాలనం చేసుకోగానే టీవీలు చూస్తున్న వారంతా కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
టీవీలు, మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షప్రసారం
అనేకమంది దక్షిణకొరియా ప్రజలు టీవీలు, మొబైల్ ఫోన్లలో ఈ బేటీ గురించిన ప్రత్యక్ష ప్రసారాలను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఎప్పుడూ అణుప్రయోగాలు జరుపుతూ గతం కొద్ది రోజుల వరకు కూడా దక్షిణకొరియాకు ఉత్తరకొరియా పక్కలో బళ్లెంలా ఉన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చర్చలు, శాంతి మత్రం పాడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.