పాకిస్తాన్ సరిహద్దుల్లో వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులు: బోర్డర్ దాటే మార్గం లేక..!
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదానికి, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా గుర్తింపు పొందిన తాలిబన్లు.. మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా సంవత్సరాల పాటు భరించిన అనుభవం వారికి ఉంది.
పొరుగు దేశాల వైపు పరుగులు..
తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకుంటోన్నారక్కడి ప్రజలు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి వెళ్లిపోదామా అంటూ ఎదురు చూస్తోన్నారు. పొరుగునే ఉన్న తజికిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ తమ సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు. ఆప్ఘనిస్తాన్ నుంచి ఎవరినీ రానివ్వట్లేదు. అదే సమయంలో కాబుల్, కాందహార్, మజర్-ఐ-షరీఫ్, జలాలాబాద్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి వెలుపలికి వెళ్లే రహదారులను తాలిబన్లు బ్లాక్ చేశారు. నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
బోర్డర్ వద్ద..
సరిహద్దులను దాటుకోవడానికి తమ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. కాబూల్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో.. ఆప్ఘనిస్తానీయులు పొరుగు దేశాల సరిహద్దుల్లో వేచి చూస్తున్నారు.. రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. పాకిస్తాన్, ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్తో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో వేలాదిమంది అనుమతుల కోసం ఎదురు చూస్తోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎంత భయానకంగా ఉంటుందో ఇప్పటికే ఒకసారి చవి చూశారు వారంతా.
శాటిలైట్ ఫొటోలు క్లియర్
షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని తాలిబన్లు మరోసారి చేసిన ప్రకటన ఆప్ఘనిస్తాయుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది. పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటోన్న స్పిన్ బోల్డాక్ ప్రావిన్స్ చమన్ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వారం రోజులుగా వేలాది మంది ఆఫ్ఘనిస్తానీయులు గుంపులు గుంపులుగా ఉన్న శాటిలైట్ దృశ్యాలను ఎన్డీటీవీ ఎక్స్క్లూజివ్గా ప్రచురించింది. చమన్ సరిహద్దు పోస్ట్ వద్ద సెప్టెంబర్ 6వ తేదీన శాటిలైట్ ద్వారా చిత్రీకరించిన ఫొటోలవి.
జలాలాబాద్ మీదుగా..
వారం రోజులుగా వేలాదిమంది ఆప్ఘనిస్తానీయులు జలాలాబాద్ మీదుగా స్పిన్ బోల్డక్లోని చమన్ సరిహద్దులకు చేరుకుంటున్నట్లు తెలిపింది. ఆప్ఘనిస్తానీయుల దయనీయ పరిస్థితులకు ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి. చమన్ బోర్డర్ పాయింట్- ఈ రెండు దేశాల మధ్య అత్యంత రద్దీగా ఉంటుంది. చమన్ బోర్డర్ను దాటుకుంటే పెషావర్లో అడుగు పెట్టొచ్చు. ఆప్ఘనిస్తాన్లో తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ అధికారులు చమన్ సరిహద్దు పోస్ట్ను మూసివేశారు.
Recommended Video
శాటిలైట్ ఫొటోలు..
ఈ పరిణామాలన్నింటినీ కళ్లకు కట్టినట్టుగా చూపించాయి కొన్ని శాటిలైట్ ఫొటోలు. అక్కడి దుస్థితికి అద్దం పట్టాయి. మక్సర్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ ఫొటోలను చిత్రీకరించింది. మొత్తం నాలుగు శాటిలైట్ ఫొటోలను ఆ కంపెనీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా నిల్చున్న స్థానికులను ఈ ఫొటోల్లో స్పష్టంగా చూడొచ్చు. 6వ తేదీన ఉదయం 10:36 నిమిషాలకు కాబుల్ ఎయిర్ పోర్ట్.. అక్కడికి దారి తీసే మార్గాలను చిత్రీకరించినట్లు మక్సర్ టెక్నాలజీస్ తెలిపింది.
రోజుల తరబడి శిబిరాల్లో..
పాకిస్తాన్ అధికారులు చమన్ బోర్డర్ పాయింట్ను మూసివేయడంతో తమకు అవసరమైన వస్తువులు, పిల్లలతో ఉన్న కుటుంబాలు గత కొన్ని వారాలుగా తాత్కాలిక శిబిరాల వద్ద వేచి ఉంటున్నారు. దేశం విడిచివెళ్లేందుకు వేలాది మంది సరిహద్దుల వద్దకు చేరుకున్న దృశ్యాలను స్పష్టంగా చూపుతున్నాయి. స్పిన్ బోల్డకే కాకుండా తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతం షిర్ఖాన్, ఇరాన్ సరిహద్దు ఇస్లాంఖలా, పాకిస్తాన్ మరోసరిహద్దు టోర్ఖామ్లకు కూడా వేలాది మంది చేరుకుంటున్నారు.