పాకిస్థాన్కు సౌదీ షాక్.. భారత్పై యుద్ధానికి నో!
పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉండగా.. పాకిస్థానీలు ఆనందంతో ఉన్నారు. "ముస్లిం నాటో"గా పిలవబడుతున్న ఈ రక్షణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా నుంచి పాకిస్థాన్ వరకు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకవేళ భారత్ పాకిస్థాన్పై దాడి చేస్తే సౌదీ అరేబియా, టర్కీ రెండూ దానికి సహాయం చేస్తాయని పాకిస్థానీలు సంతోషిస్తున్నారు. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఓ దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణిస్తారు. మక్కా రక్షణ ఒప్పందం పాకిస్థాన్ దౌత్య స్థానాన్ని గణనీయంగా బలోపేతం చేసిందనడంలో సందేహం లేదని, భవిష్యత్తులో దాని సైనిక బలాన్ని కూడా గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంటున్నారు. భారత్ గురించి సౌదీ అరేబియా నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
భారత్, సౌదీ అరేబియాల మధ్య చాలాకాలంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. వేలాది మంది భారతీయులు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పలుమార్లు భారత్ను సందర్శించారు. మిల్లీ క్రానికల్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్తో రక్షణ ఒప్పందం కుదిరినంత మాత్రాన భవిష్యత్తులో భారత్తో ఘర్షణ పడటానికి సౌదీ అరేబియా లేదా టర్కీ నుంచి పాకిస్తాన్కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు కాదని సౌదీ నిపుణులు అంటున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రకటనలు చాలా సంయమనంతో కూడుకున్నవి. అంతేకాకుండా, సౌదీ నిపుణులు భారత్ వ్యతిరేక వాదనను తిరస్కరిస్తున్నారు.

పాకిస్థాన్కు షాకిచ్చిన సౌదీ నిపుణుడు
మక్కా ఒప్పందాన్ని ఇండియాకు వ్యతిరేకంగా చేసుకున్న దురాక్రమణ ఒప్పందంగా చూడాలన్న వాదనను సౌదీ అరేబియా నిపుణుడు బదూర్ సోషల్ మీడియాలో కొట్టిపారేశారు. "సౌదీ అరేబియాకు భారత్, గ్రీస్లతో బలమైన వ్యూహాత్మక స్నేహం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉన్నత స్థాయి దౌత్యం ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించింది, ఇది తదనంతరం కాల్పుల విరమణకు దోహదపడింది." అని పేర్కొన్నారు.
మక్కా రక్షణ ఒప్పందం పూర్తిగా రక్షణాత్మకమైనదని, ఏ దేశానికీ వ్యతిరేకంగా నిర్దేశించబడలేదని కూడా బదూర్ పేర్కొన్నారు. అందువల్ల ఇది దాడి చేయడానికి చేసుకున్న ఒప్పందం అనే వాదన అర్థరహితమన్నారు. ఈ మూడు దేశాలలో ఏదైనా ఒకదానిపై శత్రువు దాడి చేస్తేనే ఇది అమల్లోకి వస్తుంది. లేకపోతే ఇది శాంతి, స్థిరత్వాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుంది. దీనిని యావత్ ప్రపంచం గుర్తించాలి. బదూర్ ప్రకటన సౌదీ అరేబియా ప్రభుత్వానిది కానప్పటికీ.. సౌదీ అరేబియాలో ఈ ఒప్పందాన్ని కేవలం భారతదేశ వ్యతిరేక ఒప్పందంగా మాత్రమే చూడటం లేదని ఇది చూపిస్తోంది.
భారత్, సౌదీ అరేబియా మధ్య కూడా రక్షణ ఒప్పందం
బదూర్ వాదన సౌదీ అరేబియా విదేశాంగ విధానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. సౌదీ అరేబియా భారత్తో తన సంబంధాన్ని వేగంగా బలోపేతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ఇండియాతో తన సంబంధాన్ని దెబ్బతీయాలని కోరుకోదు. సౌదీ అరేబియా, భారత్ మధ్య ఈ సంబంధం కేవలం వాణిజ్యపరమైనది మాత్రమే కాదు. 2025లో స్థాపించబడిన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ద్వారా భారత్, సౌదీ అరేబియా మధ్య ఓ రక్షణ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం నేపథ్యంలో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన అధికారులు కూడా సౌదీ అరేబియాతో చర్చలు జరిపారు.
సౌదీ అరేబియా ఇండియాపై బాంబు దాడి చేయబోదు..
మరో సౌదీ విశ్లేషకుడు ఫైసల్ మాట్లాడుతూ.. ఈ రక్షణ ఒప్పందం అంటే సౌదీ అరేబియా ఇప్పుడు భారతదేశంతో పోరాడటానికి కట్టుబడి ఉందని అర్థం కాదని పేర్కొన్నారు. మక్కా ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా, టర్కీ విమానాలు భారతదేశంపై స్వయంచాలకంగా బాంబు దాడులు చేయవని తెలిపారు. యుద్ధం వస్తే అది ఎవరు ప్రారంభించారు, పరిస్థితి ఏమిటనేది సమీక్షించిన తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు. భారత్ తో ఉన్న వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా.. యుద్దంలో భాగస్వామి కావడం కంటే.. మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని నివారించడమే సౌదీ అరేబియా విధానంగా ఉంటుందని ఆయన తెలిపారు.




Click it and Unblock the Notifications