ఖతార్తో నాలుగు అరబ్ దేశాలు‘కటీఫ్’! పౌరులకు 14 రోజుల గడువు!
ఖతార్తో తమకున్న దౌత్య సంబంధాలను సౌదీఅరేబియా, ఈజిప్ట్, బహ్రేన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెగతెంపులు చేసుకున్నాయి.
రియాద్: ఖతార్తో తమకున్న దౌత్య సంబంధాలను నాలుగు అరబ్ దేశాలు తెగతెంపులు చేసుకున్నాయి. చుట్టుపక్కల దేశాలను అస్థిరపరుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాలు తెలిపాయి.
ఖతార్తో ఉన్న తమ సరిహద్దులను సౌదీ అరేబియా ఇప్పటికే మూసివేసినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ఎస్పీఏ తెలిపింది. సముద్ర, వాయుమార్గాలను కూడా మూసివేసినట్లు సౌదీ అరేబియా పేర్కొంది.
ఉగ్రవాదం, వేర్పాటువాదుల ముప్పు కారణంగా ఈ సరిహద్దులను జాతీయ భద్రతా దళాలు పరిరక్షిస్తాయని అధికారులు తెలిపారు. ముస్లిం బ్రదర్హుడ్తో సహా పలు ఉగ్రసంస్థలకు ఖతార్ మద్దతు ఇస్తోందని ఆయా దేశాలు ఆరోపిస్తున్నాయి.
ఖతార్తో సంబంధాలు తెంపుకొన్న దేశాల్లో సౌదీఅరేబియా, ఈజిప్ట్, బహ్రేన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. ఖతార్ పౌరులు ఈ దేశాలను విడిచి వెళ్లేందుకు 14రోజుల గడువును ఇచ్చాయి.
మరోపక్క ఈజిప్ట్ కూడా ఖతార్కు సంబంధించిన రవాణా జరగకుండా వాయు, జల మార్గాలను మూసివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్ దౌత్యవేత్తలను తమ దేశం విడిచి వెళ్లాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆదేశించింది. ఇందుకు వారికి 48 గంటల సమయం ఇచ్చింది.
ఆ దేశం ఉగ్రవాదులకు, వేర్పాటు వాదులకు నిధులు, మద్దతు ఇస్తోందని ఆరోపించింది. 'తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకు, దేశ భద్రతను అస్థిర పరుస్తున్నందుకు తాము ఖతార్ తో సంబంధాలు తెంపుకొంటున్నట్లు' బహ్రెన్ తెలిపింది.