ఇజ్రాయెల్ కు చైనా మిత్రుల కూటమి షాక్..! భారత్ కౌంటర్..!
ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ఇవాళ భీకర పోరు దాల్చింది. ఇరాన్ అణుస్ధావరాలు, శాస్తవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. దీంతో ఇవాళ ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో స్పందించిన భారత్ దౌత్య, చర్చల మార్గాల్లో ఇరుదేశాలూ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరింది. అయితే ఇవాళ చైనా మిత్రదేశాలతో కూడిన షాంఘై సహకార సమాఖ్య మాత్రం భిన్నంగా స్పందించింది.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల్ని షాంఘై సహకార సమాఖ్య ఖండించింది. చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ , బెలారస్ వంటి దేశాలతో కూడిన ఈ కూటమి ఇజ్రాయెల్ దూకుడుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభ్య దేశాలు ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర లక్ష్యాలపై ఇటువంటి దూకుడు చర్యలు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను తీవ్రంగా ఉల్లంఘించడమే అని పేర్కొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్చలు జరపాలని నిర్ణయించింది.

అయితే ఈ చర్చలకు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. ఇజ్రాయెల్-ఇరాన్ పోరుపై ఇప్పటికే తమ వైఖరి స్పష్టం చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ కూటమిలో భాగంగా ఉన్న భారత్ వీరి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం ఆపేలా దౌత్య, చర్చల మార్గాల్లో ప్రయత్నించాలని నిన్న భారత విదేశాంగశాఖ కోరింది. అదే విషయం మరోసారి గుర్తుచేసింది. దీంతో చైనా మిత్ర దేశాలకు షాక్ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications