ఒకే వేదికపై మోదీ.. పుతిన్.. జిన్పింగ్ : ఫేస్ టు ఫేస్ - అదే లక్ష్యం..!!
షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సభ్య దేశాల అగ్రనేతల శిఖరాగ్ర సదస్సు గురువారం ప్రారంభం కానుంది. ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో ఈ సదస్సులో కీలక నేతలు ముఖా ముఖి సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. భారత ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికను పంచుకోనుండడం ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకత. కొవిడ్ విజృంభణ తర్వాత అగ్రనేతలు నేరుగా ఒకేచోట కలుసుకోవడం ఇదే తొలిసారి.
ఒకే వేదిక మీదకు కీలక నేతలు
2020లో మాస్కోలో జరిగిన ఎస్సీవో సదస్సుకు నేతలందరూ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. రెండు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి. 2001లో ప్రారంభమైన ఎస్సీవోలో 8 దేశాలు.. చైనా, కజక్స్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్లకు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్, పాక్లు 2017లో పూర్తిస్థాయి సభ్యులయ్యాయి. ఎస్సీవోలో పరిశీలక దేశాలుగా.. అఫ్గానిస్థాన్, బెలారస్, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్బైజాన్లు చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి.
పుతిన్ తో ప్రధాని మోదీ చర్చలు
గత ఏడాది దుషాంబే శిఖరాగ్ర సదస్సు హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు. ఈ సమావేశాల సమయంలో భారత్-పాక్ తో పాటుగా భారత్-చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలకు అవకాశం ఉంటుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని క్రెమ్లిన్ నుంచి ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసారు. సదస్సు సందర్భంగా భారత్, పాక్ ప్రధానులు పరస్పరం ఎదురుపడితే మర్యాద పూర్వకంగా పలకరించుకోవడం మినహా రెండు దేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
కీలక అంశాలే ప్రధాన అజెండాగా
వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి, జి-20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలను అజెండాలో చేర్చారు. తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలింది. ఈ పరిస్థితుల్లో మోదీ, జిన్పింగ్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా కనిపిస్తోంది.