కొండ చరియల కింద సజీవ సమాధి: బంగ్లాలో 134కు చేరిన మరణాలు, దిగ్బంధంలో చైనా సిటీ షెన్జెన్
బంగ్లాదేశ్లోని కొండ జిల్లాల్లో రెండు వారాలుగా ‘మొరా’ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో మూడు జిల్లాల పరిధిలో గత మూడు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 134 మందికి చేరుకున్నది.
ఢాకా/ బీజింగ్: నైరుతి రుతుపవనాల ప్రభావం ప్లస్ బంగాళాఖాతంలో అల్ప పీడనం వల్ల భారతదేశంతోపాటు బంగ్లాదేశ్, చైనాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగ్లాదేశ్లోని కొండ జిల్లాల్లో రెండు వారాలుగా 'మొరా' తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో మూడు జిల్లాల పరిధిలో గత మూడు రోజుల్లో మరణించిన వారి సంఖ్య 134 మందికి చేరుకున్నది. కొండ చరియల కింద వేల ఇండ్లు ధ్వంసమయ్యాయి.
మృతుల్లో ఒక ఆర్మీ మేజర్, కెప్టెన్ సహా మరో ఇద్దరు సైనికులు ఉన్నారు. వంద మందికి పైగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. మట్టిదిబ్బల కింద చిక్కుకుని మరికొంత మంది మరణించే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. సుమారు 98 మంది మట్టి దిబ్బల కింద సజీవ సమాధి అయ్యారని సమాచారం.
పలువురి ఆచూకీ తెలియడం లేదు. ప్రజలంతా నిద్రపోతున్న సమయంలో కొండ చరియలు విరిగి పడటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నదని, మృతుల్లో బాలలు ఎక్కువగా ఉన్నారని అధికారులు చెప్పారు.
సహాయ చర్యల్లో సైన్యం
భారత సరిహద్దులకు సమీపంలోని రంగామతి జిల్లాలోనే దాదాపు 100 మంది మరణించినట్లు సమాచారం. చిట్టాగాంగ్ జిల్లాలోని రంగూనియా, చందానాయిష్ ఉప జిల్లాల పరిధిలో 30 మంది, బందార్బన్ జిల్లాలో ఏడుగురు మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రంగామతి జిల్లా నుంచి చిట్టగాంగ్ పోర్ట్ సిటీకి వెళ్లే రహదారిపై శిథిలాలు తొలగిస్తుండగా కొండ చరియలు విరిగి పడటంతో ఇద్దరు సైనికాధికారులు, మరో ఇద్దరు సైనికులు కొండ చరియల కింద మరణించారని, పదిమందికి గాయాలయ్యాయని సైనికాధికార ప్రతినిధి చెప్పారు. మరొక సైనికుడి ఆచూకీ తెలియడం లేదన్నారు.
అడవుల నరికి వేత వల్లే వైపరీత్యాలు
ప్రభుత్వ యంత్రాంగంతోపాటు సైన్యం సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొంటున్నదని ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం షా కమల్ తెలిపారు. వర్షాలతో విరిగి పడ్డ మట్టి దిబ్బల కింద భారీగా ప్రాణనష్టం వాటిల్లడం ఇటీవలి కాలంలో ఇదే మొదటి సారని నిపుణులు చెప్తున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల అడవులు నరికివేయడం వల్లే దక్షిణ ప్రాంత జిల్లాల్లో తరుచుగా కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం సీజన్లో ప్రజలను కొండ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బదులు వారికి శాశ్వత నివాస ఏర్పాట్లు చేయాలని నిపుణులు చెప్తున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతోపాటు చిట్టగాంగ్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. చిట్టగాంగ్లో 222 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
షెన్జెన్లో లక్ష మందికి పైగా తరలింపు
చైనాలోని షెన్జెన్ నగరం మెర్బోక్ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలతో జల దిగ్బంధంలో చిక్కుకున్నది. కేవలం సోమ, మంగళవారాల్లోనే నగరం నుంచి లక్ష మందికి పైగా ప్రజలను చైనా అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మరోవైపు 232 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ ఏడాదిలో షెన్జెన్ నగరాన్ని
షెన్జెన్ నగరంలో సగటు వర్షపాతం 81 మిల్లీమీటర్లుగా కాగా, సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు 219 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మెర్బోక్ తుఫాను ప్రభావంతో సెకన్కు 23 మీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. ఈ ఏడాదిలో షెన్జెన్ నగరాన్ని తాకిన తుఫాన్లలో ఇది రెండవది. దీని ప్రభావంతో సెకన్కు 23 మీటర్ల వేగంతో చలి గాలలు వీస్తున్నాయని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. ఇలాగే వర్షాలు కురిస్తే అధికార యంత్రాంగం మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తున్నది.