రైలు ముందు సెల్ఫీ.. యువతి ప్రాణం తీసింది(వీడియో)
బీజింగ్: నేటి తరం యువత తమ ప్రాణాలకు ముప్పని తెలిసినా సెల్ఫీల మోజుతో సాహసాలు చేస్తున్నారు. వారి సాహసమే వారి ప్రాణాలమీదరకు తెస్తోంది. తాజాగా అలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది.
దక్షిణ చైనాలోని ఫోషన్లో వేగంగా వస్తున్న రైలు పక్కనే నిల్చొని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ గుర్తుతెలియని పర్యాటకురాలు ప్రమాదవశాత్తు రైలు పట్టాల కిందకు దూసుకెళ్లి అక్కడికక్కడే మరణించింది.
ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చైనాకు చెందిన 'పీపుల్స్ డెయిలీ ఆన్లైన్' ఆమె ఫొటోతోనే మంగళవారం కథనం రాసింది. రైలు పట్టాలకు సమీపంలోనే లియాంతంగ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కాపలా లేని రైలు క్రాసింగ్ ఉంది.
రైలు పట్టాలకు ఆనుకొని 33 ఎకరాల్లో అందమైన గులాబీ వనం ఉంది. ఆ వనాన్ని చూడటం కోసం అనేక మంది పర్యాటకులు అక్కడికి వచ్చి పోతుంటారు. ఆరోజు కూడా అక్కడికి పర్యాటకులు పలువురు వచ్చారు. వారు కూడా గులాబీ వనంలో, రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకున్నారు.
అందరిలాగే 19ఏళ్ల ఓ పర్యాటకురాలు రైలు పట్టాల పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. తోటి పర్యాటకులు హెచ్చరించినా.. రైలు కూత పెట్టినా పట్టించుకోలేదు. ఆమె పట్టాలపై లేకపోయిన వేగంగా వచ్చిన రైలు అమెను పట్టాల కిందకు లాక్కెళ్లింది.
ఆమె తలకు బలమైన కావడంతో అక్కడికక్కడే మరణించింది. ఆమె ప్రమాదానికి గురైన దశ్యాన్ని తోటి ప్రయాణికులు ఫొటోలు తీశారు. ప్రమాదం జరిగిన తర్వాత రైలు ఆగింది.
కాపలాలేని క్రాసింగ్ వద్ద ఎన్నో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, పర్యాటకురాలి వివరాలు ఇప్పటివరకు తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.