డ్రోన్ వార్: అమెరికా అయినా సరే.. వదిలే ప్రసక్తే లేదు, కూల్చిపారేస్తాం: పాక్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు, ఉగ్రవాద సంస్థలకు పరోక్ష సాయంపై ఏనాడూ పెదవి విప్పని పాకిస్తాన్ తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
అంతేకాదు, అది అమెరికా అయినా సరే వదిలే ప్రసక్తే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశ సరిహద్దు, ఉపరితలాలపై తిరిగే డ్రోన్లపై దాడులు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు పాక్ భద్రతా దళాలకు కఠిన సూచనలు చేసినట్లు ఆ దేశ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ వెల్లడించారు.
''పాక్ గగనతలంలోకి ప్రవేశించే ఏ డ్రోన్నూ విడిచిపెట్టం. అవి అమెరికాకు చెందిన డ్రోన్లు అయినా సరే.. కూల్చివేతకు గురికాక తప్పదు..'' అని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ పేర్కొన్నారు.
పాకిస్తాన్ చేష్టలపై కొన్నాళ్లుగా అమెరికా తీవ్ర వ్యతిరేకత కనబరుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ఆ ధోరణి మరీ ఎక్కువైంది. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అమెరికా అర్థం చేసుకుంది.
నిజానికి అమెరికా సైన్యం 2004 నుంచి అఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దులలోని గిరిజన ప్రాంతాల్లో గస్తీ కాస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఎక్కువగా తలదాచుకునే అవకాశం ఉండటంతో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తూ వస్తోంది.
రెండు వారాల క్రితం అమెరికా డ్రోన్ ఒకటి పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో సంచరిస్తూ ముగ్గురు మిలిటెంట్లపై కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టింది. ఇన్నాళ్లూ దీనిపై నోరు మెదపని పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నట్లుండి అమెరికాకు కూడా వార్నింగ్ ఇచ్చే రీతిలో ప్రకటన చేయడం సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ తాజా నిర్ణయం నేపథ్యంలో అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.