వర్ణ వివక్ష పోరాట యోధుడు ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు కన్నుమూత
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసిన హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. టుటు కుటుంబసభ్యులతోపాటు దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
'ఈ ఉదయం కేప్ టౌన్ లోని ఒయాసిస్ ఫ్ట్రైల్ కేర్ సెంటర్లో టుటు తుది శ్వాస విడిచారు' అని ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, మృతికి గల కారణాలు తెలియజేయలేదు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో మరొకరిని కోల్పోయామన్న అధ్యక్షుడు రామఫోసా.. టుటుతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
జోహన్నెస్బర్గ్ కు మొదటి నల్లజాతి బిషప్గా, తర్వాత కేప్ టౌన్ ఆర్చ్ బిషప్గా ఆయన వ్యవహరించారు. 1997లో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కొన్నేళ్లుగా ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
The passing of Archbishop Emeritus Desmond Tutu is another chapter of bereavement in our nation’s farewell to a generation of outstanding South Africans who have bequeathed us a liberated South Africa. pic.twitter.com/vjzFb3QrNZ
— Cyril Ramaphosa 🇿🇦 (@CyrilRamaphosa) December 26, 2021
కాగా, దక్షిణాఫ్రికా నైతిక దిక్సుచిగా పేరుపొందారు డెస్మంటు టుటు. 1980ల్లో స్థానికంగా నల్ల జాతీయులపై క్రూరమైన అణిచివేత పాలనకు, జాతి వివక్షతకు వ్యతిరేకరంగా పోరాడిన ప్రముఖుల్లో టుటు ఒకరు. ఎల్జీబీటీల హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేశారు. ఆయన అహింసాయుత పోరాటానికి గుర్తింపుగా 1984లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.