ఎల్టీటీఈ ఛీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ? సాక్ష్యాలున్నాయంటున్న శ్రీలంక ...!
ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ వస్తున్న ఊహాగానాల్ని శ్రీలంక ప్రభుత్వం తోసిపుచ్చింది. అందుకు అవకాశమే లేదంటోంది.
90వ దశకంలో శ్రీలంకలో సింహళీయులకూ, మైనార్టీ తమిళులకూ మధ్య జరిగిన భీకర పోరుతో ప్రపంచానికి పరిచయమైన ఎల్టీటీఈ ఛీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ 2009లో ఆర్మీ బలగాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఓ దశలో శ్రీలంకలో పలు ప్రాంతాల్ని ఆక్రమించుకుని, దేశంపై పట్టు సంపాదించేలా కనిపించిన ప్రభాకరన్.. ప్రభుత్వానికి విదేశాల నుంచి అందిన సాయంతో ఎదురొడ్డి నిలవలేకపోయాడు. అయితే ప్రభాకరన్ మరణించి 14 ఏళ్ల తర్వాత తాజాగా తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ ఆయన ఇంకా బతికే ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. దీంతో కలకలం రేగుతోంది.
నెడుమారన్ చేసిన ప్రకటనపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. ప్రభాకరన్ బతికే ఉన్నారన్న వార్తల్ని లంక ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో నెడుమారన్ ప్రకటనను ఓ జోక్ గా అభివర్ణించింది. ప్రభాకరన్ 2009 మే 19న శ్రీలంక ఆర్మీ చేతిలో ప్రాణాలు కోల్పోయాడని, ఇందుకు ఆయన డీఎన్ఏ రిపోర్టే సాక్ష్యమని, ఆయన బతికొచ్చే అవకాశం లేదని తెలిపింది. దీంతో నెడుమారన్ ప్రకటన వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది.

1983లో శ్రీలంకలో మెజార్టీ సింహళీయులకు, మైనార్టీ తమిళులకు మధ్య మొదలైన పోరు 2009లో ప్రభాకరన్ సహా ఎల్టీటీఈ అగ్రనేతల మరణాలతో ముగిసింది. ఆ తర్వాత సింహళీయుల పాలన కొనసాగుతోంది. ఈ మూడు దశాబ్దాల్లో ఎల్టీటీఈ శ్రీలంకలో ఓ రేంజ్ లో మారణహోమం సృష్టించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో లంక ప్రభుత్వానికి చుక్కలు చూపించింది. అంతే కాదు ఈ వ్యవహారంలో తలదూర్చినందుకు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని సైతం మానవ బాంబుతో ఆత్మాహుతి దాడి చేసి పొట్టనపెట్టుకుంది. అప్పట్లో లంకలో జాఫ్నాతో పాటు పలు ప్రాంతాల్ని ఆక్రమించి చాలా సంవత్సరాల పాటు లంక ఆర్మీ దానిపై పట్టు సాధించకుండా చేసింది. చివరికి అదే విదేశీ సాయంతో లంక ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చుకుని ప్రభాకరన్ సహా ఎల్టీటీఈ కీలక నేతల్ని మట్టుబెట్టింది.












Click it and Unblock the Notifications