దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు: వెళ్లే ముందు..: మాల్దీవుల్లో: భార్య, బాడీగార్డ్
కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స.. తాజాగా దేశం విడిచి పారిపోయారు. కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉంటోన్నారు. వేల సంఖ్యలో ప్రజలు దండెత్తడంతో ఆయన తన అధికారిక నివాసాన్ని వదిలి వెళ్లారు. ఇన్ని రోజులు ఆయన నౌకాదళాధికారుల ఆశ్రయంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్లో గడిపారని సమాచారం.
ఇప్పుడు తాజాగా ఆయన దేశం విడిచి పారిపోయారు. వెళ్లే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాని రణిల్ విక్రమసింఘె ఇవ్వాళ పార్లమెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. రాజపక్స స్థానంలో రణిల్ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని అంటున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకూ ఆయన కొనసాగుతారని అక్కడి మీడియా చెబుతోంది.

గొటబయ రాజపక్స.. మాల్దీవులకు వెళ్లారనే ప్రచారం సాగుతోంది. మిలటరీ ఎయిర్క్రాఫ్ట్ ఆంటొనొవ్-32లో ఆయన దేశం దాటారని తెలుస్తోంది. ఆ సమయంలో భార్య, వ్యక్తిగత భద్రత సిబ్బంది, మరో నలుగురు మాత్రమే ఉన్నట్టు శ్రీలంక మీడియా పేర్కొంది. ఇమిగ్రేషన్ అధికారులను ఉటంకించింది. ప్రస్తుతానికి మాల్దీవులకు వెళ్లారని, మళ్లీ అక్కడి నుంచి మరో దేశానికి బయలుదేరొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ నెల 9వ తేదీన వేలాదిమంది ఆందోళనకారులు ఆయన అధికార నివాసం మీదికి దండెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స తన కుటుంబంతో సహా నివాసాన్ని వీడారు. ఓ అంబులెన్స్లో ఆయన పారిపోయారు. అనంతరం గజబాహు షిప్లో తలదాచుకున్నారు. రాజపక్స పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె కూడా తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడి రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరినట్టయింది.












Click it and Unblock the Notifications