ఆందోళనకారుల చేతుల్లో ప్రధానమంత్రి కార్యాలయం: మరో పిక్నిక్ స్పాట్: ఆ నిర్ణయంపై జనాగ్రహం
కొలంబో: శ్రీలంకలో ఆందోళనలు తగ్గుముఖం పట్టట్లేదు. మరింత రాజుకుంటోన్నాయి. పతాక స్థాయికి చేరుకుంటోన్నాయి. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన అనంతరం అనూహ్య పరిణామాలు సంభవిస్తోన్నాయి. మొన్నటికి మొన్న దేశాధ్యక్షుడి భవనాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఆందోళనకారులు ఈ సారి ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనూహ్య పరిణామాలతో..
గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయిన అనంతరం ఆందోళనకారులు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె అధికారిక నివాసం, ఆయన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. రణిల్ విక్రమసింఘెను అధికారికంగా నియమిస్తూ పార్లమెంట్ స్పీకర్ మహీంద యాప అబేయవర్దనె ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీని తరువాత ఈ నిరసన జ్వాలలు మరింత చెలరేగాయి. ఉధృతరూపాన్ని ధరించాయి.
ఆ నిర్ణయంతో..
గొటబయ రాజపక్స లేకపోవడం వల్ల అధ్యక్షుడిగా ఆయనను అపాయింట్ చేశారు స్పీకర్. అదే ఇప్పుడు ఆందోళనకారుల ఆగ్రహానికి కారణమైంది. రణిల్ కూడా తన అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేస్తోన్నారు. ఇదే డిమాండ్తో వారు రోడ్డెక్కారు. ఆయన నివాసం, ప్రధానమంత్రి కార్యాలయం వైపు దూసుకెళ్లారు. వేలాదిమంది ఆందోళనకారులు ప్రదర్శనగా చేరుకోగా.. భద్రత బలగాలు వారిని అడ్డుకున్నాయి. లోనికి ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.
యుద్ధ వాతావరణం..
దీనితో ఆందోళనకారులు భద్రత బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వారిని అడ్డుకోవడానికి భధ్రత బలగాల భాష్పాయువు గోళాలను ప్రయోగించారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహించారు. దీనితో అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొలంబో మాత్రమే కాకుండా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే ఉద్రిక్తత కనిపించింది. అంతకంతకూ పరిస్థితులు చేయి దాటుతోండటంతో ఎమర్జెన్సీని ప్రకటించారు.
ప్రధాని కార్యాలయంలో..
మొన్నట్లాగా దేశాధ్యక్షుడి భవనానికి వందలాదిగా బారులు తీరిన లంకేయులు.. ఇక ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా పిక్నిక్ స్పాట్లాగా మార్చేశారు. భవనం పైకి ఎక్కి జాతీయ జెండాలను ఎగురవేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై వైరల్గా మారాయి. ప్రధానమంత్రి ఛాంబర్లోకి వెళ్లి.. అక్కడి కుర్చీల్లో కూర్చున్నారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
జాతీయ ఛానల్ ప్రసారాలు నిలిపివేత..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ ఛానల్ ప్రసారాలను అధికారులు అప్పటికప్పుడు నిలిపివేశారు. ఈ మేరకు శ్రీలంక రూపవాహిణి కార్పొరేషన్ తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనలకు సంబంధించిన ఏ ఒక్క దృశ్యాన్ని కూడా ప్రసారం చేయకూడదని ఆదేశించింది. లైవ్ టెలికాస్ట్లో వార్తలు చదువుతుండగానే హఠాత్తుగా ప్రసారాలు స్తంభించిపోయాయి. దేశాధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె అపాయింట్ అయిన మరుక్షణమే రూపవాహిణి కార్పొరేషన్ ఈ ఆదేశాలు ఇచ్చింది.