తెలుగమ్మాయి శ్రీశుభకు ‘మిస్ ఇండియా సౌత్ ఆఫ్రికా గ్వాటెంగ్’ కిరీటం
ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు అమ్మాయి, అందాల సుందరి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను ‘మిస్ ఇండియా సౌత్ ఆఫ్రికా గాటెంగ్’ కిరీటాన్ని గెలుచుకున్నారు.
జొహాన్నెస్బర్గ్: ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగు అమ్మాయి, అందాల సుందరి శ్రీశుభ అద్దేపల్లి 2017 సంవత్సరానికి గాను 'మిస్ ఇండియా సౌత్ ఆఫ్రికా గ్వాటెంగ్' కిరీటాన్ని గెలుచుకున్నారు.
ఇక్కడి ఓ ప్రముఖ బ్యాంకులో ఆమె 14 నెలల ఒప్పంద ఉద్యోగినిగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐటీ నిపుణురాలైన శ్రీశుభ...తన స్నేహితుల ప్రోత్సాహంతో ఈ పోటీలో నిలిచారు.
ఎనిమిది మంది స్థానిక సుందరీమణులు ఆమెకు గట్టిపోటీ నిచ్చారు. పోటీ సందర్భంగా ఇతర విభాగాల్లోనూ ఆమె చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ పోటీ సందర్భంగా శ్రీశుభ ఓ నృత్యప్రదర్శన ఇచ్చారు.
కేవలం మూడు నిముషాల వ్యవధిలో తన జీవితానికి సంబంధించిన మూడు కీలక దశలను తన నాట్యంతో అద్భుతంగా ఆవిష్కరించారామె. సున్నితభావజాలం, మృదు వర్తన ఉన్న కుటుంబ నేపథ్యం తనదని ఆమె చెప్పారు. తన నాట్యంలోని తొలిదశలో ఆ కోమలనేపథ్యాన్ని ప్రదర్శించానన్నారు.
తర్వాత తండ్రి మరణం వంటి వ్యధాభరిత పరిణామాలతో కుంగదీసిన అనుభవాలను ప్రతిబింబింపచేశారు. మూడో దశలో 'నేనెవరు' అనే తన ఆంతరంగిక అన్వేషణను నాట్యంలో ప్రతిఫలింపచేసినట్లు తెలిపారు.
శ్రీశుభ ప్రదర్శించిన ఈ నాట్యం న్యాయనిర్ణేతల ప్రశంసలను అందుకుంది. ఇరవైఏడేళ్ల క్రితం 'మిస్ ఇండియా దక్షిణాఫ్రికా పోటీ'ని ప్రారంభించిన ఫరూక్ ఖాన్ మాట్లాడుతూ... ఈ కిరీటాన్ని గెలుచుకున్న రెండో భారతీయ యువతి శ్రీశుభ అని తెలిపారు.