లోదుస్తులు విప్పి.. గుర్రం పగ్గంతో.. విచక్షణా రహితంగా..
తమ చేతులు, కాళ్లు, తొడుల, వెనుక భాగంలో విచక్షణా రహితంగా తమను గాయపరిచిన తీరును వీడియో, ఫోటోల ద్వారా స్నేహితుడికి చేరవేశారు.
న్యూఢిల్లీ: ఏజెంట్ల మోసానికి.. పని ప్రదేశంలో వేధింపులకు బలయ్యే గల్ఫ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా గల్ఫ్ లో చిత్రహింసలు అనుభవిస్తున్న ఇద్దరు భారతీయులు తమ వేదనను వీడియోల రూపంలో ఇండియాలో ఉన్న స్నేహితుడికి చేరవేశారు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన పర్వేజ్ అహ్మద్(24), మహ్మద్ అక్రమ్(27) నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం ఖతర్ వెళ్లారు. పుణేకు చెందిన ఓ ఏజెంట్ వీరిని ఖతర్ పంపించాడు. వాస్తవానికి పర్వేజ్ ను ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్ గా పనిచేసేందుకు ఏజెంట్ ఒప్పందం కుదిర్చాడు.
తీరా అక్కడికెళ్లాక.. సౌదీఅరేబియా-ఖతర్ సరిహద్దులో ఉన్న ఓ ఫామ్ హౌజ్ లో ఇద్దరిని తీసుకెళ్లి పడేశారు. అక్కడే ఉంటూ ఒంటెలు, మేకల సంరక్షణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా చెప్పారు. అయితే అక్కడే పనిచేస్తోన్న ఓ అధికారి వీరిద్దరిని హింసించడమే పనిగా పెట్టుకున్నాడు.
ఇద్దరి బట్టలు విప్పించి.. ఆఖరికి లోదుస్తులు కూడా విప్పించి.. గుర్రాలను అదుపు చేసే పగ్గంతో వీరిని చితకబాదుతున్నాడు. రక్తం మోడేలా కొడుతుండటంతో అతని హింసను భరించలేక ఇద్దరు నరకం అనుభవిస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఆఫ్తామ్ ఆలంకు దీనికి సంబంధించిన వీడియోను పంపించారు.
తమ చేతులు, కాళ్లు, తొడుల, వెనుక భాగంలో విచక్షణా రహితంగా తమను గాయపరిచిన తీరును వీడియో, ఫోటోల ద్వారా స్నేహితుడికి చేరవేశారు. తాము ఇక్కడినుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నామని తెలిస్తే.. తమను తప్పుడు కేసులో ఇరికించడమో.. లేక మరో చోటుకు పంపించడమో చేస్తారని.. కాబట్టి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను కాపాడాల్సిందిగా వీడియోలో పర్వేజ్ వేడుకున్నాడు.