జవాబిస్తాం: నిర్మలా హెచ్చరిక, మాపై నిందలేస్తే దాడులే.. భారత్కు పాకిస్తాన్ గట్టి వార్నింగ్
న్యూఢిల్లీ: సంజువాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్కు చెందిన జైష్ ఏమొహమ్మద్ ఉగ్ర సంస్థే ఈ దాడి చేసిందని గుర్తించింది.
ఈ దాడిపై భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పలు విషయాలు తెలిపారు. ఈ దుస్సాహసంపై పాకిస్థాన్ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
పాక్ వెనుకేసుకొస్తుంది
పాకిస్తాన్ వెనకేసుకొస్తోన్న జైష్ ఏ మహ్మద్ ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రతి దాడులు జరిపిన భారత ఆర్మీ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిందన్నారు. ఈ ఉగ్రదాడిపై ఎవరు చేశారన్న దానిపై తాము ఇప్పటికే ఆధారాలు సంపాదించామని చెప్పారు.
ధీటుగా జవాబిస్తాం
పాకిస్తాన్ ప్రభుత్వానికి వాటిని పంపుతామని సీతారామన్ చెప్పారు. తాము ఆధారాలు పంపుతున్నప్పటికీ పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అయినప్పటికీ తాము ఈసారి కూడా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ దీటుగా జవాబు ఇస్తూనే ఉందన్నారు. అంతకు ముందు ఆమె జమ్ములోని మిలటరీ హాస్పిటల్కి వెళ్లి సుంజువాన్ ఉగ్రదాడిలో గాయాలపాలైన వారిని పరామర్శించారు.
సరిహద్దు మీదుగా దాడులు చేస్తామని పాక్ హెచ్చరిక
సంజువాన్ దాడిపై ఉగ్రవాదుల దాడికి పాక్కు చెందిన జైష్ ఏ ఉగ్రవాదులు కారణమని భారత్ అనుమానిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఘాటుగా స్పందించింది. తమపై నిందలు వేస్తే కాశ్మీర్ సరిహద్దు మీదుగా దాడులు చేస్తామని హెచ్చరించింది. పూర్తిగా విచారణ జరపకుండానే భారత్ తమపై నిందలు వేస్తోందని ఇది సహించబోమని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. తాము సర్జికల్ స్ట్రయిక్స్కు దిగుతామని హెచ్చరించింది.
సహనం ఉంది కానీ
ఉగ్రదాడిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ భారత్ సహనశీల దేశమని, కానీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే సత్తా కలిగిన దేశమని పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చారు.