ఆప్ఘాన్లోని భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు: వాహనాలను ఎత్తుకెళ్లారు
కాబూల్: ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. దేశ పౌరులపైనే కాల్పులు జరుపుతూ తమ పైశాచికాన్ని చాటుకుంటున్నారు. దేశ పౌరులకు, ఇతరు దేశస్తులకు హాని కలిగించమని, ఆప్ఘనిస్థాన్ ఇతర దేశాలకు వ్యతిరేకంగా పనిచేయదని ఇటీవల పేర్కొన్న తాలిబన్లు.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో అరాచకాన్ని సృష్టిస్తూ మానవ హక్కులను హరిస్తున్నారు.
తాలిబన్ల అరాచకాలను ముందే ఊహించిన విదేశాలకు చెందిన రాయబార కార్యాలయాలను ఆయా దేశాలు మూసివేశాయి. భారత్, అమెరికా ఇలా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసివేసి, సిబ్బందిని స్వదేశాలకు రప్పించుకున్నాయి. ఇతర దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. తాజాగా, విదేశీ రాయబార కార్యాలయాల్లో దాడులు చేస్తున్నాయి. కీలక పత్రాలుంటే తీసుకెళ్తున్నాయి.

ఆప్ఘాన్లోని కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కీలక పత్రాలు ఏమైనా దొరుకుతాయోనని వారు ఇలా చేసివుంటారని తెలుస్తోంది. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ వద్ద ఉన్న వాహనాలను తాలిబన్లు తీసుకెళ్లారు.
ఇక జలాలబాద్, కాబూల్లో ఉన్న కాన్సులేట్, ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేశారా? లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు. గత ఆదివారం కాబూల్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ఆప్ఘాన్లో తమ రాజ్యం మొదలైందనే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆప్ఘాన్లోని తమ దౌత్య సిబ్బందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇంకా మిగిలి ఉన్న భారతీయులను కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
కాగా, ఆప్ఘనిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఆప్ఘాన్ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు దూరమవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఆగస్టు 19న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకునేందుకు రోడ్లపైకి జాతీయ జెండాలతో వచ్చిన పౌరులపై తాలిబన్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పలువురు మృతి చెందారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆప్ఘాన్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని, వాటిని నియంత్రించేందుకే తాము ఆప్ఘానిస్థాన్ నుంచి వైదొలిగామని జో బైడెన్ తెలిపారు. ఆప్ఘాన్ నుంచి తమ సేనలను ఉపసంహరించుకోవడాన్ని సమర్థించుకున్నారు. ముప్పు ఉన్న చోట దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జో బైడెన్ తెలిపారు. సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఆల్ఖైదా, ఐసిస్ ప్రాబల్యం పెంచుకున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని బైడెన్ పేర్కొన్నారు. అయితే, తాలిబన్లు అమెరికా సేనలు వెళ్ళిపోయిన స్వల్పకాలంలోనే ఆప్ఘానిస్థాన్ను స్వాధీనం చేసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆప్ఘానిస్థాన్లోని అమెరికన్లను పూర్తిగా తరలించేంత వరకూ తమ దేశాలు అక్కడే ఉంటాయన్నారు.
కాగా, దాదాపు 30 వేల మంది ఆప్ఘాన్ శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇవ్వనుందని, ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని జో బైడెన్ తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఆప్ఘాన్ లోని అమెరికా సేనలకు దుబాసీలుగా, ఇన్ఫార్మర్లుగా పనిచేసిన వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. కాగా, అమెరికన్లతోపాటు ఆప్ఘాన్ పౌరులు కూడా విమానాల్లో ఆ దేశానికి పయనమవుతున్నారు. ఇక తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆప్ఘానిస్థాన్కు ఆయుధాలను విక్రయించకూడదని అమెరికా నిర్ణయించింది. ఆయుధాలను విక్రయించకుండా నిషేధం విధిస్తున్నట్లు బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక, అమెరికా బ్యాంకుల్లోని సొమ్మును వాడుకోకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఆప్ఘానిస్థాన్లో తాలిబన్ల పాలన ప్రారంభమైననాటి నుంచీ ఆ దేశంలోని పౌరులు విదేశాలకు వెళ్లిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లేందుకు చాలా మంది విఫలయత్నం చేస్తున్నారు. కొందరు మహిళలు తమ పిల్లలను కాబూల్ విమానాశ్రయంలోని అమెరికా దళాలకు గోడల అవతలి నుంచి విసిరేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒంటరిగా మహిళలు కనిపిస్తే కాల్చి వేసే పరిస్థితులు నెలకొనడంతో మహిళలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఆప్ఘాన్ పౌరులకు తాము ఎలాంటి హాని చేయమంటూనే.. తమను వ్యతిరేకించేవారిని మాత్రం వదిలిపెట్టమని తాలిబన్లు హెచ్చరిస్తుండటం గమనార్మం. ఇప్పటికే తాలిబన్ల దాడుల్లో వందల మంది ఆప్ఘాన్ పౌరులు మరణించారు.
తాలిబన్లు కాబూల్ను ఆక్రమించుకునే ముందే ఆప్ఘాన్ ప్రధాని అష్రఫ్ ఘనీ.. తజకిస్థాన్ పారిపోయిన విషయం తెలిసిందే. రక్తపాతం జరగకూడదని తాను దేశం విడిచిపోయినట్లు ఆయన చెప్పారు. అంతేగాక, తాను భారీగా సొమ్ము తీసుకుపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. తనకు బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం అష్రఫ్ ఘనీ యూఏఈలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. కాగా, తాలిబన్లకు తెరవెనుక పాకిస్థాన్, చైనాలు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. తాలిబన్లు ఆప్ఘానిస్థాన్ను ఆక్రమించుకున్న తర్వాత ఈ రెండు దేశాలు కూడా హర్షం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాలిబన్ల పాలనను తాము గుర్తిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు చైనా కూడా తాలిబన్లతో తమ స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా, దేశాధినేత పారిపోవడంతో ఆప్ఘాన్ చట్ట సభ్యులు కూడా ఇతర దేశాలకు పారిపోయారు. పలువురు చట్టసభ్యులు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు.












Click it and Unblock the Notifications