సొంత నేతలకే తాలిబన్ల షాకులు-పాకిస్తాన్ ఎంట్రీతో మారిన సీన్-పంజ్ షీర్ గెలుపు రహస్యం
ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోందో తేలిపోయింది. ప్రభుత్వాధినేతగా ఎవరుండబోతున్నారో, ప్రభుత్వంలో ఎవరెవరికి చోటు దక్కనుందో కూడా నిర్ణయమైపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలను సైతం మించిపోయి తాలిబన్లు ఎంచుకున్న షరియా ప్రాధాన్యతలు, అలాగే మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న తీవ్రవాదులకు నేరుగా చోటు కల్పించడం వంటి చర్యలపై ప్రపంచ దేశాల్లో చర్చ జరుగుతోంది.

తాలిబన్ల కొత్త సర్కార్
తాలిబన్ల కొత్త సర్కార్ ఏర్పాటుపై అంతర్జాతీయంగా భిన్న చర్చలు సాగుతున్నాయి. కొత్త ప్రభుత్వానికి సారధ్యం వహించబోతుూన్న ముల్లా హసన్ తో పాటు ఆయనకు డిప్యూటీ కాబోతున్న ముల్లా బరాదర్,. హక్కానీ నెట్ వర్క్ నేత, మోస్ట్ వాంటెడ్ సిరాజుద్దీన్ హక్కానీకి చోటు కల్పించడం ద్వారా తాలిబన్లు గట్టి సంకేతాలు పంపారన్న చర్చ జరుగుతోంది. త్వరలో ఏర్పాటుకాబోయే సర్కార్ లో ఎవరెవరుంటారనే దానిపై తాలిబన్లు అధికారిక ప్రకటన చేసినప్పటి నుంచి మొదలైన ఈ చర్చ ఇప్పుడు దేశ విదేశాలకు పాకింది. దీంతో తాలిబన్ల ప్రభుత్వం భవిష్యత్ ప్రాధాన్యతపై వారి మిత్రదేశాలతో పాటు పశ్చిమాసియాలోని మిగతా దేశాల నేతలంతా చర్చించుకుంటున్నారు.

సొంత నేతలకే షాక్
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని త్వరగానే కుప్పకూల్చిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రం చాలా ఎక్కువ సమయమే తీసుకున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆప్ఘన్ పోరులో ఊహించని విజయం దక్కిన తర్వాత తాలిబన్లకు ఎదురేలేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు వెనువెంటనే చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అదే సమయంలో పంజ్ షీర్ పోరు కొనసాగుతుండటం, పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్ పర్యటన, తాలిబన్లలో అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైంది. అయితే చివరికి సొంత నేతలకు షాకులిస్తూ తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించినట్లు తెలుస్తోంది.

ముల్లా బరాదర్ స్ధానంలో ముల్లా హసన్
ఆప్ఘనిస్తాన్ ప్రధానిగా తాలిబన్ల కమాండర్, రాజకీయవ్యవహారాల్లో, దౌత్య వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముల్లా బరాదర్ ఎంపికనట్లేనని అంతా అనుకుంటున్న తరుణంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్ ఆయన్ను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో ఆప్ఘన్ అధ్యక్షుడు కాబోతున్న హైబతుల్లా అఖుంద్ జాదా తనకు సన్నిహితుడైన ముల్లా హసన్ ను తెరపైకి తెచ్చారు. దీంతో ప్రధాని అవుతాడనుకున్న ముల్లా బరాదర్ కాస్తా డిప్యూటీ ప్రధానికి పరిమితం కాగా.. తాలిబన్ల సంస్ధ రెహబరీ షురాకు నేతృత్వం వహిస్తున్న ముల్లా హసన్ కాస్తా ప్రధానిగా ఎంపికయ్యారు. ఈ వ్యవహారం ద్వారా సొంత నేతలకే తాలిబన్లు షాకిచ్చినట్లు అర్ధమవుతోంది.
Recommended Video

మహిళలకు నో- హక్కానీకి ఎస్
తాలిబన్లు తమ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి చోటు ఇవ్వాలనే విషయంలో సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే చివరికి మహిళలకు చోటు ఇవ్వరాదని నిర్ణయించారు. అంతకు ముందు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని దేశంలో మహిళలకు పిలుపు నిచ్చిన తాలిబన్లు... ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. షరియా చట్టాల్ని అమలు చేస్తున్నట్లు చెప్పుకుంటూ మహిళలకు ప్రభుత్వంలో చోటిస్తే ఇస్లామిక్ దేశాల నుంచి విమర్శలు తప్పవని భయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అమెరికా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదీ సిరాజుద్దీన్ హక్కానీకి చోటివ్వడం కూడా విమర్శలకు తావిచ్చేలా ఉంది. హక్కానీ నెట్ వర్క్ నుంచి కీలక నేతలకు తాలిబన్ ప్రభుత్వంలో చోటివ్వాల్సిందేనన్న పాకిస్తాన్ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుున్నట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ ఎంట్రీతో మారిన సీన్
అంతవరకూ తమ కేబినెట్ లో ఎవరెవరుండాలనే దానిపై తాలిబన్లు సుదీర్ఘ కసరత్తు చేసినా తుది రూపు మాత్రం తీసుకురాలేకపోయారు. ఎందుకంటే పైకి విదేశీ జోక్యం సహించబోమని చెప్తున్న తాలిబన్లు.. పాకిస్తాన్ జోక్యంతోనే కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారు. మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించకపోవడం, అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడని తెలిసి సిరాజుద్దీన్ హక్కానీ కి చోటివ్వడం, అదే సమయంలో అప్పటి వరకూ ప్రధాని రేసులో ఉన్న ముల్లా బరాదర్ ను పక్కనబెట్టి ముల్లా హసన్ ను తెరపైకి తేవడం వంటి పరిణామాలన్నింటికీ పాకిస్తానే కారణంగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఛీఫ్ ఆప్ఘనిస్తాన్ పర్యటన తర్వాత ఈ పరిణామాలన్నీ వేగంగా చోటు చేసుకున్నాయి. ఆ తర్వాతే పంజ్ షీర్ లోయలో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగి తాలిబన్లకు విజయాన్ని అందించింది.












Click it and Unblock the Notifications