Haibatullah Akhundzada : ఆప్ఘన్ కొత్త అధ్యక్షుడు-ఏకగ్రీవ ఎన్నిక- తాలిబన్ల ఛీఫ్ ప్రస్ధానమిదే
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన తాలిబన్లు ఇప్పుడు దాని స్ధానంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త అధ్యక్షుడి ఎంపికపై కూడా మంతనాలు జరుపుతున్నారు. కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ల సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్ జాదాను ఎంపిక చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల ప్రస్దానంలో కీలకంగా వ్యవహరించిన హైబతుల్లాకు ఆప్ఘన్ గడ్డపై అణువణువునా పట్టుంది. దీంతో పాటు తాలిబన్లను నడిపించడానికి ఆయనే సరైన నేతగా భావిస్తున్నారు.

తాలిబన్ల సర్కార్ ప్రయత్నాలు
ఆప్ఘనిస్తాన్ ను పూర్తిగా ఆక్రమించిన తర్వాత అక్కడ పాగా వేసిన తాలిబన్లు... ప్రజా ప్రభుత్వం స్ధానంలో తమ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన చర్చలు జరుపుతున్నారు. పొరుగున ఉన్న మిత్రదేశం పాకిస్తాన్ ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లకు పలు సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హక్కానీ నెట్ వర్క్ ప్రతినిధులకు కూడా ప్రభుత్వంలో చోటు కల్పించాలని సూచించింది. వీరితో పాటు ఇంకా ఎవరెవరికి ప్రభుత్వంలో స్ధానం కల్పించాలన్న అంశంపై చర్చలు జరుగతున్నాయి.

ప్రభుత్వం స్ధానంలో పాలకమండలి
ఆప్ఘనిస్తాన్ లో ఇప్పటివరకూ ప్రభుత్వం పాలించగా.. ఇప్పుడు ఆ స్ధానంలో తాలిబన్లు కొత్త పాలక మండలిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఉండే వారే మంత్రులుగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి అధ్యక్షుడిగా ఛీఫ్ ను నియమిస్తారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలే కీలకంగా మారబోతున్నాయి.
ఈ అధ్యక్షుడిగా ఎవరిని ఉంచాలనే అంశంపై కూడా తాలిబన్టు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దేశ అధ్యక్షుడితో సమాన అధికారాల్ని ఈ పాలకమండలి ఛీఫ్ కు కట్టబెట్టనున్నారు.మరోవైపు ఈ పాలకమండలిలో చేరాలని ఆప్ఘనిస్తాన్ కు చెందిన మాజీ సైనికులు, మాజీ పైలట్లకు తాలిబన్లు సమాచారం పంపుతున్నారు.

కొత్త అధ్యక్షుడిగా హైబతుల్లా అఖుంద్ జాదా
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో ఏర్పడబోతున్న తాలిబన్ల సర్కార్ లో అధ్యక్షుడిగా తమ కీలక నేత హైబతుల్లా అఖుంద్ జాదాను నియమించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాలిబన్లను ఇంతకాలం నడిపిస్తున్న కీలక నేతల్లో ఒకరైన అఖుంద్ జాదా ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ ను పాలిస్తున్న పాలక మండలి ఛీఫ్గా నియమితులయ్యే అవకాశముంది.
అధ్యక్ష పదవితో సమానంగా ఈ పదవికి అధికారాలు కట్టబెట్టబోతున్నారు. ఈ పాలక మండలే భవిష్యత్తుల్లో ఆప్ఘన్ పరిణామాల్ని నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆష్రఫ్ ఘనీ సర్కార్ పాలించిన కాబూల్ లోని పార్లమెంటు భవనం నుంచే ఈ పాలక మండలి కూడా పాలన సాగించబోతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఎవరీ అఖుంద్ జాదా ?
కాందహార్ కు చెందిన 60 ఏళ్ల హైబతుల్లా అఖుంద్ జాదా తన ప్రస్ధానమంతా దాదాపుగా అజ్ఞాతంలోనే సాగించాడు. 2016లో తాలిబన్ల ఛీఫ్ గా ఉన్న అక్తర్ మన్సూర్ అమెరికా బలగాలు జరిపిన డ్రోన్ దాడిలో చనిపోయినప్పుడు తెరపైకి వచ్చాడు. స్వతహాగా న్యాయనిపుణుడైన అఖుంత్ జాదా... తాలిబన్ల బాధ్యతలు స్వీకరించకముందు నైరుతి పాకిస్తాన్ లోని కుచ్లక్ లో ఉన్న ఓ మసీదులో బోధనలు చేసేవాడు.
తాలిబన్లలో చేరాక వారి రాజకీయ, మత, సైనిక వ్యవహారాల్ని నిర్ణయించే స్దాయికి హైబతుల్లా ఎదిగాడు. మతపరమైన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాడని పేరున్న హైబతుల్లా త్వరలో ఏర్పడే తాలిబన్ ప్రభుత్వానికి సారధిగా వ్యవహరించబోతున్నాడు.
ఇప్పటికే పాకిస్తాన్ లోని క్వెట్టాలో సమావేశమైన తాలిబన్ నేతలు ఆయన్ను పాలకమండలి ఛీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్ల పాలనలో ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్ని మాత్రం తాలిబన్లలో తన తర్వాత రెండో స్ధానంలో ఉన్న అబ్దుల్ ఘనీ బరాదర్ కు అప్పగించే అవకాశముంది.












Click it and Unblock the Notifications