పేరు మార్చుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ: కొత్త పేరు ఏంటంటే?
న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్తాన్ ను ప్రధాన కేంద్రంగా చేసుకుని, భారత్ లో తరచూ ప్రాణాంతక దాడులు, నరమేథానికి పాల్పడుతున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు మారింది. తనకు తానే సరికొత్త పేరును ప్రకటించుకుంది. ఈ కొత్త పేరులో జమ్మూ కాశ్మీర్ అనే పదాలను చేర్చింది. ఓ ఉగ్రవాద సంస్థ తన పేరులో జమ్మూ కాశ్మీర్ అనే పేరును జోడించుకోవడం ఇదే తొలిసారి. దీనితో ఆ సంస్థ ఉద్దేశమేందో స్పష్టమైనట్టేనని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకోవడం లేదా, దాన్ని ప్రధాన అంశంగా తీసుకుని, భారత్ లో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు పాల్పడటం ఖాయమని ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు వెల్లడించారు. కనీసం 30 మంది ఆత్మాహూతి దళ సభ్యులను జైషె మహమ్మద్ సంస్థ భారత్ లో మారణ హోమాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంచినట్లు నిర్ధారించారు.
బిహారీ దొంగల చేతివాటం.. ఒక్క రాత్రిలో 328 సంచుల ఉల్లిపాయలు చోరీ!
పేరు మార్పు ఎందుకంటే..
జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసింది జైషె మహమ్మద్ సంస్థే. ఈ దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులు అయ్యారు. ఈ ఘటన తరువాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దృష్టి కూడా జైషె మహమ్మద్ సంస్థపై పడింది. ఫ్రాన్స్, అమెరికా వంటి కొన్ని దేశాలు జైషె కార్యకలాపాలపై నిషేధం విధించారు. జైషె మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను అరెస్టు చేయాలంటూ కొన్ని అంతర్జాతీయ దేశాల నుంచి పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్దిడి వచ్చింది. ఇష్టం లేకపోయినా ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్తాన్ ప్రభుత్వం.. జైషె కార్యకలాపాలపై నిఘా ఉంచింది. మౌలానా మసూద్ అజర్ ను అరెస్టు చేసింది. ఈ రకమైన ప్రతిఘటన ఎదురు కావడంతో.. పేరును మార్చుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు. జైషె మహమ్మద్ అనే పేరు మీద ఎలాంటి లావాదేవీలను నిర్వహించడానికి వీలు లేకుండా పోవడం వల్ల కొత్త పేరును పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త పేరు ఇదే..
మజ్లిస్ ఉరుస-ఎ-షుహుదా జమ్మూ వ కాశ్మీర్.. ఇదీ జైషె మహమ్మద్ సంస్థ కొత్త పేరు. పేరు మారినప్పటికీ.. తీరు మారలేదు. నాయకత్వ మార్పిడి కూడా చోటు చేసుకోలేదు. మౌలానా మసూద్ అజర్ అనారోగ్యం పాలు కావడం, ఆయన పై పాకిస్తాన్ ప్రభుత్వం డేగకన్ను వేసిన నేపథ్యంలో.. మసూద్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్.. ఆ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అస్ఘర్ సారథ్యంలోనే బాలాకోట్ లో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాలు మళ్లీ పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. జైషె మహమ్మద్ జెండాలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఇంతకుముందు జైషె జెండాలో అల్-ఇస్లాం అనే పేరు ఉండగా.. దాని స్థానంలో కొత్తగా అల్-జిహాదీ అనే పేరును తగిలించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. అస్ఘర్ నాయకత్వంలో భారత్ పై మరిన్ని దాడులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని వారు కేంద్ర హోం మంత్రిత్వశాఖను అప్రమత్తం చేశారు.
30 మంది ఆత్మాహూతి దళ సభ్యులు సిద్ధంగా..
భారత్ లో మారణ హోమాన్ని సృష్టించడానికి 30 మందికి పైగా ఆత్మాహూతి దళ సభ్యులను జైెషె మహమ్మద్ సంస్థ సిద్ధం చేసినట్లు అధికారులు కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఏ క్షణంలోనైనా వారు సరిహద్దులను దాటుకుని భారత గడ్డపై అడుగు పెట్టే అవకాశాలు లేకపోలేదని అన్నారు. పాకిస్తాన్ మర్దాన్, స్వాబి, నుస్రత్ జయీష్, ఒకారా వంటి ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని మదరసాల్లో రాడికల్ సిద్ధాంతాలను బోధిస్తున్నట్లు, వాటిని జైషె మహమ్మద్ సంస్థే పర్యవేక్షిస్తున్నట్లు తేలింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా ఈ పరిణామాలు శరవేగంగా చోటు చేసుకున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు దేశీయంగా శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
500 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో..
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాతావరణం ఆశించిన స్థాయిలో ఏ మాత్రం లేదని, జమ్మూ కాశ్మీర్ మొదలుకుని, రాజస్థాన్ గుజరాత్ లోని సర్ క్రీక్ ప్రాంతం వరకూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలో ఇంటెలిజెన్స్ అధికారులు ఈ కీలక సమాచారాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చేరవేయడం చర్చనీయాంశమైంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ భూభాగంపై సుమారు 500 మంది వరకు ఉగ్రవాదులు తిష్ట వేసుకుని కూర్చున్నట్లు సమాచారం ఉందని బిపిన్ రావత్ చెన్నైలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము అప్రమత్తంగా ఉన్నామని, సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అన్నారు. ఎప్పుడైనా, ఏదైనా, ఎలాంటి పరిస్థితులైనా తలెత్తడానికి గల అవకాశాలను కొట్టి పారేయలేమని బిపిన్ రావత్ తేటతెల్లం చేశారు.