ఫస్ట్బ్యాచ్: కాబుల్ నుంచి దోహా మీదుగా స్వదేశానికి భారతీయులు: మార్మోగిన విమానం
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ ఆ దేశ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాలిబన్ల ఆటవిక, రాక్షసత్వ పరిపాలనకు భయపడి.. దేశం విడిచి వెళ్లిపోతోన్న ఆఫ్ఘనిస్తానీయులతో రోజూ క్రిక్కిరిసి పోతోంది. వేలాదిమంది కాబూలీవాలాలు ఇప్పటికీ విమానాశ్రయంలోనే గడుపుతోన్నారు. అందుబాటులో ఉన్న విమానాన్ని పట్టుకుని దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తోన్నారు.

కాబుల్ ఎయిర్పోర్ట్లో విమానాల సందడి..
ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ అమెరికా సైనిక బలగాల ఆధీనంలో ఉంది. అందుకే- వేర్వేరు దేశాలకు చెందిన పౌరుల తరలింపు సజావుగా సాగుతోంది. ఇదివరకు కాబుల్ ఎయిర్పోర్ట్ ఎయిర్ స్పేస్ను మూసివేయడం వల్ల ఆర్మీ విమానాలు, ఎయిర్క్రాఫ్టులు, హెలికాప్టర్లకు మాత్రమే అనుమతి ఉండేది. ఎప్పుడైతే ఈ విమానాశ్రయం అమెరికా సైనిక బలగాల చేతుల్లోకి వెళ్లిందో.. అప్పటి నుంచి పౌర విమానాలకు టేకాఫ్, ల్యాండింగ్కు పర్మిషన్ లభించింది.

భారతీయుల తరలింపు ముమ్మరం..
దీనితో భారత్ కూడా రెండు ఎయిరిండియా విమానాలను ఆఫ్ఘనిస్తాన్కు పంపించింది. భారతీయుల తరలింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న ఆగస్టు 14వ తేదీ తరువాత భారత్ నుంచి కాబుల్ ఎయిర్పోర్ట్కు వెళ్లిన రెండో సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ ఇదే. పౌర విమానాలు రాకపోకలు సాగించడానికి అనుమతి లభించడంతో- అల్లకల్లోలంగా మారిన కాబుల్లో చిక్కుకుపోయిన వందలాది మంది భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ఇక మరింత ముమ్మరం చేసింది.

పొరుగు దేశాలకు తరలింపు..
కాబుల్ నుంచి పక్కనే ఉన్న తజకిస్తాన్, దోహాలకు తరలిస్తోంది. అక్కడి భారత రాయబార కార్యాలయాల వద్ద వారికి ఆశ్రయాన్ని కల్పించింది. అక్కడి నుంచి వారంతా ఇతర విమానాల ద్వారా స్వదేశానికి చేరుకుంటారు. ఆప్ఘన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపును వేగవంతం చేయాలనే ఉద్దేశంతో- ఎయిరిండియా విమానాలు కాబుల్ నుంచి నేరుగా స్వదేశానికి చేరుకోవట్లేదు. దీనివల్ల ఏర్పడే జాప్యాన్ని నివారించడానికి పొరుగు దేశాల్లో సురక్షితంగా వారిని ల్యాండ్ చేయిస్తోంది.

భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు..
తాజాగా- 87 మంది భారతీయులు, ఇద్దరు నేపాలీయులతో కూడిన ఎయిరిండియా విమానం ఏఐ 1956 ద్వారా కాబుల్ విమానాశ్రయం నుంచి తజకిస్తాన్కు చేరింది. వారిని అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేసింది. ప్రస్తుతం వారంత తజికిస్తాన్ రాజధాని దుషాంబెలోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్నారు. ఆప్ఘనిస్తాన్ నుంచి బయటపడుతున్నామనే ఆనందం భారతీయుల్లో కనిపించింది. విమానంలోకి ఎక్కిన వెంటనే- వారంతా భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.. జయజయధ్వానాలు పలికారు. వారి నినాదాలతో ఫ్లైట్ మార్మోగిపోయింది.

ఖతర్ నుంచి భారత్కు
అంతకుముందు- కాబుల్ నుంచి ప్రత్యేక ఎయిరిండియా ఫ్లైట్లో ఖతర్ రాజధాని దోహాకు చేరుకున్నారు 137 మంది భారతీయులు. వారంతా ఖతర్లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్నారు. వారందరినీ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టింది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖతర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంది. ఎయిరిండియా విమానాలు తరలివెళ్లడానికి అవసరమైన తక్షణ ఏర్పాట్లు చేసింది.
500 మంది
ఇవ్వాళ ఒక్కరోజే కనీసం 500 మంది భారతీయులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి భారతీయుడినీ సురక్షితంగా తరలించేంత వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధులు అరిందమ్ బాగ్జీ తెలిపారు. పొరుగు దేశాల సహాయ సహకారాలతో భారతీయులను స్వదేశానికి చేర్చుతున్నామని పేర్కొన్నారు. అమెరికా, నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ బలగాల చేతుల్లో ఉందని, ఫలితంగా తరలింపు సజావుగా సాగుతోందని వ్యాఖ్యానించారు.
Recommended Video
అమెరికా సైనిక బలగాల రక్షణ..
ఇప్పటిదాకా అమెరికా అత్యధిక సంఖ్యలో తమ దేశ పౌరులను తరలించింది. ఇప్పటిదాకా తొమ్మిదివేల మందికి పైగా తమ దేశ పౌరులను సురక్షితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాటించింది. ఈ విమానాశ్రయం తమ ఆధీనంలో ఉంది. దీనికోసం 5,600 మంది సైనిక బలగాలను ఎయిర్పోర్ట్లో మోహరింపజేసింది. అలాగే- తాలిబన్లు అడ్డంకులను సృష్టిస్తోండటం వల్ల ఎయిర్పోర్ట్కు చేరుకోలేకపోతోన్న తమదేశ పౌరులకు ఎస్కార్ట్ సౌకర్యాన్ని కల్పించింది. ఫ్లైట్ ఆపరేషన్స్, విమానాల రాకపోకలు సజావుగా సాగుతున్నాయని స్పష్టం తెలిపింది.












Click it and Unblock the Notifications