The Great Conjunction:గురు-శని గ్రహాలు అత్యంత దగ్గరగా..భారత్లో ఎప్పుడు చూడాలంటే..?
ఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం చందమామ భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు బ్లూ మూన్ కూడా ఆకాశంలో దర్శనం ఇచ్చింది. ఇక ఉల్కల సంగతి చెప్పక్కర్లేదు. ఐదురోజుల క్రితం కూడా చంద్రుడు, శని గ్రహం (saturn) గురు గ్రహం (Jupiter) ఈ మూడు త్రిభుజం ఆకారంలో కనిపించి కనువిందు చేశాయి. చీకటి పడగానే ముందుగా నెలవంక చంద్రుడు కనిపించింది. ఆ తర్వాత క్రమంగా రెండు గ్రహాలు కనిపించాయి.
Recommended Video
ఇలా దాదాపు రెండు గంటల పాటు ఈ అద్భుతమైన దృశ్యం వినీలాకాశంలో కనిపించింది. ఇక తాజాగా మరో అద్భుతం ఆకాశంలో కనువిందు చేయనుంది. రెండు గ్రహాలు అత్యంత సమీపంలోకి వస్తాయి. దీన్నే ది గ్రేట్ కంజన్క్షన్గా పిలుస్తారు. తెలుగులో సంయోగం అని అంటారు. ఇంతకీ దీని విశేషాలేంటి..?
డిసెంబర్ 21న అకాశంలో సంయోగం
ఆకాశంలో మరో అద్భుతం వీక్షించేందుకు సిద్ధమైపోండి. డిసెంబర్ 21 సోమవారం రోజున ఆకాశంలో గురు శని గ్రహాలు అత్యంత దగ్గరగా వచ్చి కనువిందు చేస్తాయి. దీన్నే ది గ్రేట్ కంజన్క్షన్ లేదా సంయోగం అని పిలుస్తాము. ఇలాంటి ఓ అద్భుతమైన ఘట్టం 1623లో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ 2020లో కనిపిస్తుంది. ఇక ఇది చూడటం మిస్ అయితే మళ్లీ 2080లో మాత్రమే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కదులుతున్న ఈ రెండు గ్రహాలు 0.1 డిగ్రీల దూరంలో ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సంయోగం అంటే ఏంటి..?
డిసెంబర్ 21వ తేదీన గ్రేట్ కంజంక్షన్ ఏర్పడుతుందని అంతకంటే ఐదు రోజుల ముందు చంద్రుడు, శని, గురు గ్రహాలు త్రిభుజం ఆకారంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు.వారు చెప్పినట్లుగానే డిసెంబర్ 16వ తేదీన చంద్రుడు-గురుడు-శని గ్రహాలు త్రిభుజ ఆకారంలో ఆకాశంలో కనువిందు చేశారు. చంద్రుడు లేదా మరొక గ్రహం ఇంకో ఖగోళ వస్తువుకు సంబంధించి రేఖాంశాన్ని కలిగి ఉంటే దాన్ని సంయోగం (conjunction)గా పిలుస్తామని శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ప్రతి 19.6 ఏళ్లకు ఒకసారి గురు గ్రహం శని గ్రహంను దాటుకుంటూ వెళుతుంది. అయితే డిసెంబర్ 21న మాత్రం ఈ రెండు అత్యంత సమీపంలోకి వస్తాయని... 1623వ సంవత్సరం తర్వాత మళ్లీ అంత దగ్గరగా ఈ రెండు గ్రహాలు వస్తుండటం ఇదే తొలిసారని సైంటిస్టులు తెలిపారు.
భారత్లో ఎన్నిగంటలకు చూడాలి..?
ఇక నాసా ప్రకారం ది గ్రేట్ కంజన్క్షన్ను భూమిపై నుంచి ప్రతి ఒక్కరూ చూడొచ్చని చెబుతున్నారు. రెండు గ్రహాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు. ఒకవేళ గురు గ్రహాన్ని టెలిస్కోప్తో కనుక చూస్తున్నట్లయితే ఆ గ్రహం యొక్క నాలుగు చంద్రుళ్లు కూడా కనిపిస్తారని శాస్త్రవేత్తలు వివరించారు. సూర్యుడు అస్తమించిన ఒక గంటకు ఈ రెండు గ్రహాలు ఆకాశంలో కనిపిస్తాయట. ఇక భారత దేశంలో సాయంత్రం డిసెంబర్ 21 సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
క్రిస్మస్ స్టార్ అని ఎందుకు పిలుస్తారు..?
గురుడు-శని గ్రహాలు సంయోగంను క్రిస్మస్ స్టార్గా పిలుస్తున్నారు. రెండు గ్రహాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ కనిపించే సమయంలో మాత్రం రెండు కలిపి ఒక పెద్ద నక్షత్రంలా కనిపిస్తుండటంతో దీన్ని క్రిస్మస్ స్టార్గా లేదా బెత్లహేమ్ స్టార్గా పిలుస్తున్నారు. అంటే యేసు ప్రభువు బెత్లహేములో జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఓ పెద్ద చుక్క కనిపించిందని చెబుతారు. బైబిల్ గ్రంథంలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక ఏడాది మొత్తంలో భూమిపై ఉత్తర అర్థగోళంలో అతి తక్కువ సమయం రోజుగా దక్షిణ అర్థగోళంలో అత్యంత ఎక్కువ సమయం ఉన్న రోజుగా డిసెంబర్ 21వ తేదీకి గుర్తింపు ఉంది. ఇదే రోజున సంయోగం ఏర్పడటం యదృచ్చికంగా జరిగింది.