చిట్టచివరి సోవియట్ యూనియన్ అధినేత.. కన్నుమూత
మాస్కో: చిట్టచివరి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో ఆయన తెగువ చూపారు. దీనికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.
సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1985లో యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1991 డిసెంబర్లో రాజీనామా చేశారు. ఆయన హయాంలో సోవియట్ యూనియన్ విడిపోయింది. అణ్వాయుధాలను పరిమితం చేయడానికి, ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడానికీ అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్తో శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించారు.

అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం, మానవజాతి మనుగడ కోసం అనే పేరుతో 1987 ఫిబ్రవరిలో మాస్కోలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశానికి వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు హాజరయ్యారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడం, అణ్వాయుధాల వినియోగాన్ని నియంత్రించడంలో గోర్బచెవ్ చేసిన కృషికి గుర్తింపుగా 1990లోనే ఆయకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
శాంతి, నిరాయుధీకరణ, తన హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలకు గుర్తింపుగా భారత్ కూడా ఆయనను గౌరవించింది. ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. గోర్బచెవ్ తరువాత యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైంది. ఆర్మీనియా, అజర్బైజాన్, బెలారస్, ఈస్టోనియా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, లాత్వియా, లిథువేనియా, మోల్డోవా, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు ఆవిర్భవించాయి.
ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించడం, సోవియట్ యూనియన్లో మానవ హక్కుల ఉల్లంఘనలను నియంత్రించడం, మార్క్సిస్ట్-లెనినిస్ట్ పరిపాలనల పతనం, జర్మనీ పునరేకీకరణలో గోర్బచెవ్ కీలక పాత్ర పోషించారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని అడ్డుకోలేకపోయారు. యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తరువాత రష్యా ప్రభావం క్షీణించింది. కాగా- గోర్బచెవ్ మరణం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications