అమెరికా-చైనా మధ్య యుద్ధం?
అమెరికా, చైనా మధ్య 2025లో యుద్ధం రావొచ్చని ఏఎంసీ హెడ్ మినిహన్ అంచనా వేశారు.
అగ్రరాజ్యం అమెరికా ..రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య యుద్ధం రూపంలో అవి తారస్థాయికి చేరాయి. ఇండో- పసిఫిక్లో చైనా దుశ్చర్యలతో పాటు తైవాన్పై ఆ దేశ వైఖరి అమెరికాకు మరింత చికాకు తెప్పిస్తోంది. ఈ తరుణంలో అగ్రరాజ్యానికి చెందిన ఓ సీనియర్ సైనికాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం తలెత్తే అవకాశం ఉందని ఎయిర్ మొబిలిటీ కమాండ్ హెడ్ జనరల్ మైకమినిహన్ అంచనా వేశారు. అయితే తన అంచనా తప్పయ్యే అవకాశం కూడా ుందన్నారు. ఏఎంసీలో 50వేల మంది సిబ్బంది, 500 విమానాలు ఉన్నాయి. సైనిక దళాలకు సంబంధించి ఇంధన సరఫరా, రవాణా వ్యవస్థను ఇది పర్యవేక్షిస్తుంది.
తైవాన్ లో 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నట్లు మినిహన్ కమాండ్ సభ్యులకు లేఖ రాశారు. ఆ సమయానికి అమెరికా దృష్టి ఇతర అంశాలపై ఉంటుందని, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తైవాన్ విషయంలో ముందుకెళ్లడానికి దీన్ని అవకాశంగా మార్చుకుంటారని అంచనా వేశారు. దీనివల్ల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఆ దిశగా తీసుకుంటున్న కీలక చర్యల్ని తనకు ఫిబ్రవరి 28కల్లా నివేదించాలని ఆదేశించారు. దీనిపై అమెరికా రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారి మాట్లాడుతూ మినిహన్ వ్యాఖ్యలు అమెరికా రక్షణ వైఖరిని ప్రతిబింబించవన్నారు.
ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియల్ జనరల్ ప్యాట్రిక్ రైడర్ మాట్లాడుతూ చైనాతో సైనిక పోటీ తమ ముందున్న ప్రధాన సవాల్ అని, శాంతియుతమైన, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం మిత్రదేశాలతో కలిసి పనిచేయడంపై తాము దృష్టి పెట్టామన్నారు. తైవాన్ జలసంధి వద్ద చైనా తమ సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని తాము అనుమానిస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ గతనెలలో ఓ సందర్భంలో మాట్లాడుతూ వెల్లడించారు. తైవాన్ ను ఆక్రమించుకోవడానికి చైనా సిద్ధమవుతోందనడానికి దీన్ని సంకేతంగా భావించవచ్చన్నారు.