పిట్టకొంచెం..కూత ఘనం: ఈ అక్కాచెల్లెళ్ల మెదడు ఐన్స్టీన్ కంటే షార్ప్
లండన్: ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కవలల పేర్లు నిష్కా, నైసా. ఇద్దరూ భారత సంతతికి చెందిన వారు. ఇంతకీ వీరు సాధించిన ఘనత ఏమిటో తెలుసా... ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ మేధాశక్తినే ఈ అమ్మాయిలు అధిగమించారు. బ్రిటన్కు చెందిన ఈ అక్కా చెల్లెళ్లు మెన్సా ఐక్యూ టెస్టులో ఏకంగా 162 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
చిన్నారుల్లో తెలివితేటలు గుర్తించేందుకు మెన్సా ఐక్యూ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 140 పాయింట్లు కనుక సాధిస్తే వారిని అపరమేధావిగా గుర్తిస్తారు. అలాంటిది ఈ కవలలు ఏకంగా 162 పాయింట్లు సాధించి వావ్ అనిపించారు. స్టీఫెన్ హాకింగ్, ఐన్స్టీన్లకంటే రెండు పాయింట్లు అధికంగా ఈ బాలమేధావులు మెన్సా పరీక్షలో సాధించారు. ఈ స్థాయిలో పాయింట్లు సాధించినవారు ప్రపంచవ్యాప్తంగా ఒక్కశాతం మాత్రమే ఉన్నారు. కేవలం ఒక్క నిమిషం తేడాతో జన్మించిన నిష్కా నైసాలు చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మెన్సా ఐక్యూ టెస్టులో కొత్త రికార్డు సృష్టిస్తామని తాము ముందుగా అనుకోలేదని ఈ అక్కా చెల్లెళ్లు చెప్పారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాజోలికి వెళ్లకపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందంటూ తమ సక్సెస్ మంత్రను బయటపెట్టారు నిష్కా నైసా. తమకు ఇంకా 11 ఏళ్లేనని ఈ వయసులోనే అవన్నీ అవసరం లేదని తాము భావించినట్లు చెప్పారు ఈ చిన్నారులు. ప్రస్తుతం ఈ ఇద్దరిని చైల్డ్ జీనియస్గా ప్రకటించారు.












Click it and Unblock the Notifications