అమెరికాలో కాల్పుల కలకలం - ముగ్గురు మృతి : ఒక్క రోజు తేడాతో..!!
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. న్యూయార్క్లోని ఓ సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో.. 10 మంది మరణించిన ఘటన మరవకముందే మరోసారి కాల్పులు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో దుండుగులు చేసిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. 8 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఆదివారం న్యూయార్క్లోని ఓ సూపర్ మార్కెట్లో సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
దీంతో..అక్కడికక్కడే పది మంది ప్రాణాలు కోల్పోయారు. జాతి వివక్ష దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీని పైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం విచారం వ్యక్తం చేసారు. ఈ ఘటన పైన విచారణ జరుగుతున్న సమయంలోనే...తాజాగా హోస్టన్ సూపర్ మార్కెట్లో ఐదుగురు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం చెలరేగింది. దీంతో తుపాకులతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. నిందితుల్లో ఒకరు గాయాలతో ఆస్పత్రి పాలుకాగా... మరో ఇద్దరిని ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో అమాయక ప్రజలు గాయపడలేదని చెప్పారు. వీరి వద్ద నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరూ 20 ఏళ్ల వయసు గల వారేనని పోలీసులు చెప్పారు. కాలిఫోర్నియా నగరంలోని చర్చ్లో జరిగిన కాల్పుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురికితీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా.. అతడి వద్ద నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.