Tokyo Olympics 2021 : ఇద్దరు అథ్లెట్లకు పాజిటివ్... ఒలింపిక్స్ను వెంటాడుతున్న కరోనా భయం...
టోక్యో ఒలింపిక్స్ను 'కరోనా' వెంటాడుతోంది. ఎన్నో అనుమానాలు,సందేహాల మధ్య ఒలింపిక్స్ నిర్వహణకే జపాన్ మొగ్గుచూపినప్పటికీ... కరోనా టెన్షన్ మాత్రం వీడట్లేదు. టోక్యోలోని ఒలింపిక్స్ విలేజ్లో తాజాగా ఇద్దరు అథ్లెట్స్ కరోనా బారినపడ్డారు. ఇప్పటికే నాన్ అథ్లెట్ ఒకరు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజా కేసులతో ఒలింపిక్స్ విలేజ్లో ఒకింత ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం టోక్యోలో కరోనా కేసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.శనివారం(జులై 17) ఒక్కరోజే 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వరుసగా నాలుగు రోజు వెయ్యి పైచిలుకు కేసులు నమోదైనట్లయింది. గత వారం రోజుల్లో టోక్యోలో కరోనా కేసుల యావరేజ్ 1012గా ఉంది. ఈ ఏడాది జనవరి 27 తర్వాత కరోనా కేసుల సగటు 1 వెయ్యి మార్క్ను దాటడం ఇదే తొలిసారి.
ఇప్పటివరకూ టోక్యోలో 1,88,108 కరోనా కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసుల రీత్యా ప్రస్తుతం టోక్యో నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.

నిజానికి షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ గతేడాదిలోనే జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడక తప్పలేదు. ఈ ఏడాది కూడా కరోనా టెన్షన్ వెంటాడుతున్నా... జపాన్ ప్రభుత్వం ఒలింపిక్స్ను నిర్వహణకే మొగ్గుచూపింది. ఒకవేళ ఒలింపిక్స్ నిర్వహించని పక్షంలో లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో జపాన్ ముందడుగే వేసింది.
ఇందుకోసం ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత,విమర్శలను సైతం పట్టించుకోలేదు. ఎవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని... అంతా సజావుగానే సాగుతుందని జపాన్ ప్రధాని సుగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మెజారిటీ ప్రజలు ఒలింపిక్స్ వద్దు అనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఒలింపిక్స్ నిర్వహణకు జపాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒలింపిక్స్ వీక్షణకు జపాన్ దేశీయులకు మినహా విదేశీయులకు అనుమతి నిరాకరించింది. మరో ఆరు రోజుల్లో జులై 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. అగస్టు 8 వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. ఈసారి ఒలింపిక్ ఈవెంట్లో 33 విభాగాల్లో 339 పతకాల కోసం క్రీడాకారులు పోటీ పడబోతున్నారు.












Click it and Unblock the Notifications