భారత్ కు ఉక్రెయిన్ వార్ దెబ్బ-రష్యా సైనిక ఉత్పత్తులకు బ్రేక్-తుపాకుల నుంచి సబ్ మెరైన్ల దాకా
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రభావం ఆ రెండు దేశాలపైనే కాకుండా వారితో ప్రత్యక్ష,పరోక్ష సంబంధాలు కలిగిన మరెన్నో దేశాలపై పడుతోంది. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్లో భారత్ సహా పలు దేశాల విద్యార్ధులు ప్రాణాలు అరచేత్తో పట్టుకుని పారిపోతుండగా.. ఇప్పుడు రష్యాపై పశ్చిమదేశాలు విధిస్తున్న ఆంక్షలతో రష్యా నుంచి ఇతర దేశాలకు కీలక రక్షణ ఉత్పత్తులు, సామాగ్రి సరఫరా నిలిచిపోతోంది. ఇందులో భారత్ కూ కష్టాలు తప్పడం లేదు.
రష్యా-ఉక్రెయిన్ వార్
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రభావం ఇప్పుడు అన్నిదేశాలకూ పాకుతోంది. ఆరంభంలో ఇది ఇరుదేశాలకే పరిమితం అవుతుందని భావించినా పశ్చిమదేశాలతో పాటు నాటో, యూరప్ దేశాలు కూడా ఉక్రెయిన్ కు సాయంగా రంగంలోకి దిగడంతో రష్యా ఒంటరవుతోంది. దాని ప్రభావం దీర్ఘకాలంలో రష్యాపై తీవ్రంగా పడే ప్రమాదం కనిపిస్తోంది. అదే సమయంలో రష్యాపై ఇన్నాళ్లూ ఆధారపడిన దేశాలపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఆయా దేశాలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడుతున్నాయి.
భారత్ పై తీవ్ర ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమదేశాలతో పాటు నాటో, జీ7, యూరప్ దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా రష్యాపై ఆంక్షల్నితీవ్రతరం చేస్తున్నాయి. అయినా రష్యా లొంగడం లేదు. కానీ దీర్ఘకాలంలో రష్యాపై వీటి ప్రభావం మాత్రం తీవ్రంగానే పడే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇన్నాళ్లు ఇతర అగ్రరాజ్యాలతో కలిసి ఆయుధాలు,రక్షణ సామాగ్రి అమ్మిన దేశాలపై ఈ ప్రభావం పడబోతోంది. ఇందులో భారత్ ముందువరుసలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో భారత్ ఆచితూచి స్పందిస్తోంది.
రష్యా రక్షణ ఉత్పత్తులకు బ్రేక్
రష్యా నుంచి ప్రస్తుతం భారత్ ఆయుధాల నుంచి సబ్ మైరైన్ల వరకూ భారీగా ఉత్పత్తుల్ని కొంటోంది.ఇందులో సుఖోయ్ యుద్ధ విమానాలతో పాటు, మిగ్ 29లు ప్రధానమైనవి.ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చాలా కీలకమైనవి. రష్యా నుంచి వీటి సరఫరా నిలిచిపోతే వాటి ప్రభావం భారత్ పై తీవ్రంగా పడుతుంది. అలాగే విమానాల విడి భాగాల్ని కూడా భారత్ కు రష్యా సరఫరా చేస్తోంది. ఇప్పుడు యుద్ధంతో పాటు పశ్చిమదేశాల ఆంక్షల కారణంగా భారత్ వాటిని రష్యా నుంచి తీసుకునే వీల్లేకుండా పోతోంది. కాదని ముందడుగు వేస్తే మాత్రం కచ్చితంగా పశ్చిమదేశాల ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడుతోంది.
భారత్ పై పడే దెబ్బలివే
భారత్-రష్యా ఉమ్మడిగా చేపట్టిన ఏకే 203 రైఫిల్స్ తయారీపై యుద్ధం ప్రభావం పడబోతోంది. అలాగే ప్రాజెక్టు 11356 కింద భారత్ నాలుగు గ్రిగరోవిచ్ రేంజ్ ఫ్రిగెట్లను కొనుగోలు చేసింది. వాటికి ఉక్రెయిన్ లో గ్యాస్ టర్బైన్ ఇంజన్లు బిగించి ఇవ్వాల్సి ఉంది. కానీ క్రిమియా వార్ తర్వాత ఉక్రెయిన్ రష్యాపై ఆంక్షలు విధించడంతో ఆ ఇంజన్ల సరఫరా నిలిచిపోయింది. ఈ దశలో భారత్ బయటి నుంచి ఇంజన్లు కొని రష్యాకు ఇద్దామన్నా కుదరడం లేదు. అలాగే ఉక్రెయిన్ లో జరగాల్సిన భారత రవాణా యుద్ధ విమానం ఏఎన్ 32 కాంట్రాక్టు ఉక్రెయిన్ కు ఇచ్చారు.యుద్దంతో అదీ ఆగిపోయింది. అలాగే రష్యా నుంచి ఇతరత్రా ఆయుధాలు, విమానాలు, జలాంతర్గాములు సైతం యుద్ధం కారణంగా అక్కడి నుంచి సరఫరా కాకుండా ఆగిపోయాయి. ఇప్పట్లో ఇవి భారత చేరే అవకాశం లేకపోవడంతో కేంద్రం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతోంది.