చెత్త డీల్, పల్లీలకే అమ్మేశారు: ఒబామాపై ట్రంప్ తీవ్ర విమర్శలు, లండన్ పర్యటన రద్దు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేగాక, ట్రంప్ తన యూకే పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం. లండన్లో ఫిబ్రవరి నెలలో నూతన ఎంబసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించడానికి వెళ్లాల్సి ఉండగా.. తాను వెళ్లడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒబామా ప్రభుత్వం సెంట్రల్ లండన్లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని దూరంగా వేరే చోటుకు తరలించడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
పల్లీలకు అమ్మేశారంటూ..
ఒబామా లండన్ ఎంబసీని పల్లీలకు అమ్మేశారని, ఇది చాలా చెత్త డీల్ అని డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా ట్వీట్ చేశారు. అందుకే తాను కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. ఒబామా హయాంలో ఎంబసీని లండన్లోని గ్రోస్వెనార్ స్క్వేర్ నుంచి థేమ్స్ నది తీరంలోని నైన్ ఎల్మ్ ప్రాంతానికి తరలించారు.
తాను అభిమానిని కాదంటూ..
‘లండన్ పర్యటన రద్దు చేసుకోవడానికి కారణం.. లండన్లో మంచి ప్రాంతంలో ఉన్న ఎంబసీని పల్లీలకు అమ్మేసిన ఒబామా అడ్మినిస్ట్రేషన్కు నేనేమీ అభిమానిని కాదు, దూర ప్రాంతంలో భవనం కట్టడానికి కేవలం 1.2 బిలియన్ డాలర్లకు అమ్మేశారు. చెత్త డీల్. నన్ను వచ్చి రిబ్బన్ కట్ చేయమన్నారు- నో!' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ట్రంప్ పర్యటన రద్దు
కాగా, లండన్లో జనవరి 16న ఈ కొత్త కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ వెళ్లనున్నారు. ట్రంప్ ఫిబ్రవరిలో లండన్ వెళ్లాల్సి ఉండగా పర్యటనను రద్దు చేశారు.
బ్రిటన్తో సంబంధాలపై ప్రభావం
ట్రంప్ నిర్ణయం ఇలావుంటే.. ట్రంప్ లండన్ వస్తే పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు ఆయన వ్యతిరేకులు సన్నాహాలు చేసుకుంటుండటం గమనార్హం. లండన్ పర్యటనలో ట్రంప్.. బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో కూడా సమావేశం కావాల్సి ఉంది. ట్రంప్ పర్యటన రద్దు చేసుకోవడంతో ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని అమెరికా ప్రభుత్వాలు.. బ్రిటన్తో ఎంతో స్నేహపూర్వకంగా ఉండగా, ట్రంప్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.