చైనాను వదిలేసి భారత్ ను టార్గెట్ చేస్తారా ? స్వదేశంలో ట్రంప్ కు షాకులు..!
రష్యా చమురు కొంటూ ఉక్రెయిన్ తో యుద్ధంలో ఆ దేశానికి సాయం చేస్తున్నారన్న కారణం చూపుతూ భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్ తీరుపై స్వదేశంలో ప్రత్యర్ధి పార్టీ డెమోక్రాట్లతో పాటు ఆర్దిక వేత్తలు, చివరికి ఆయన మాజీ సలహాదారులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్ పేరు చెప్పి భారత్ పై సుంకాలు విధించడం ఏంటనే చర్చను వారు తెరపైకి తెస్తున్నారు.
రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలలో ఒకటైన చైనాను వదిలేసి.. భారత్ ను ట్రంప్ టార్గెట్ చేయడంపై స్వదేశంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశాన్ని అన్యాయంగా 50 శాతం సుంకాలతో ఒంటరిని చేసే ప్రయత్నం చేయడంపై యూఎస్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలోని డెమొక్రాట్లు విమర్శలకు దిగారు. చైనాపై లేదా ఎక్కువ మొత్తంలో రష్యన్ చమురును కొనుగోలు చేసే ఇతరులపై ఆంక్షలు విధించే బదులు, ట్రంప్ భారతదేశాన్ని సుంకాలతో ఒంటరిని చేస్తున్నారని ప్యానెల్ డెమొక్రాట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు.

అమెరికన్లను దెబ్బతీస్తున్నారని, ఈ ప్రక్రియలో అమెరికా-భారతదేశ సంబంధాన్ని కూడా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధం విషయంలో భారత్ పై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పుకునే కారణాన్నే సుంకాల నిర్ణయం బలహీనపరుస్తుందని చట్టసభ సభ్యులు ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే ఉక్రెయిన్ గురించి కాదనిపిస్తోందన్నారు. తద్వారా ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే వాణిజ్య అంశాల్లో భారత్ ను కట్టడి చేసి లబ్ది పొందేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులు మాత్రం భారత్ పై ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ యుద్ధంగా అభివర్ణించారు. రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు ఉక్రెయిన్ కు అమెరికన్ల పన్ను చెల్లింపు డబ్బులు ఇచ్చేలా తమను పురికొల్పుతున్నాయని ఆరోపించారు. భారత్ చర్యలతో అమెరికాలోని ప్రతి ఒక్కరూ నష్టపోతారన్నారు. భారతదేశం తన వైఖరిని మార్చుకుంటే తక్షణ ఉపశమనం పొందవచ్చని నవారో హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications