కీలక బిల్లుపై సంతకానికి నిరాకరించిన ట్రంప్... 1.4 కోట్ల మందిపై ఎఫెక్ట్..
అధ్యక్ష పదవి చరమాంకంలోనూ డొనాల్డ్ ట్రంప్ తన ట్రంపరితనాన్ని వీడట్లేదు. అత్యంత కీలకమైన కోవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీకి సంబంధించిన బిల్లుపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించారు.దీంతో గత 9 నెలలుగా నిరుద్యోగులు,కరోనా కారణంగా దెబ్బతిన్నవాళ్లకు అందుతున్న ఆర్థిక సాయానికి బ్రేక్ పడనుంది. సుమారు 1.4కోట్ల మంది ప్రజలపై ఈ ఎఫెక్ట్ పడనుందని లేబర్ డిపార్ట్మెంట్ డేటా చెబుతోంది.
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఏడాది మార్చిలో అమెరికా ప్రభుత్వం 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా నిరుద్యోగుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది.అయితే ఈ బిల్లుకు సంబంధించిన గడువు మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్ ఇటీవల 900 బిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీకి సంబంధించిన బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ప్రతీ నెలా నిరుద్యోగుల ఖాతాల్లో 600 డాలర్లు జమ చేయనున్నారు.
అయితే ఈ బిల్లు ద్వారా ప్రజా ప్రయోజనాల కంటే విదేశీ వ్యవహారాలు,సాంస్కృతిక పరమైన కార్యక్రమాలు ఇతరత్రా ప్రత్యేక కార్యక్రమాల కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. బిల్లులో నిరుద్యోగులకు ప్రతిపాదించిన 600 డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని 2వేల డాలర్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఈ బిల్లులో ప్రతిపాదించిన పరిహారాన్ని చాలా తక్కువ మొత్తం అని పేర్కొన్నప్పటికీ తక్షణ సాయం అవసరమని,కాబట్టి ఈ బిల్లు స్వాగతించదగినదేనని అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ అధ్యక్ష పదవి గట్టిగా మరో నెల రోజులు మాత్రమే ఉంది. జనవరి 20,2021న ఆయన వైట్ హౌస్ను ఖాళీ చేయాలి. అధ్యక్ష పదవి చరమాంకంలోనూ ట్రంప్ ఇలా కీలక బిల్లులను నిరాకరించడం వైట్ హౌస్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కాగా,ఇటీవల సమావేశమైన అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్దే విజయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. బైడెన్కు 306 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు దక్కగా.. రిపబ్లికన్ పార్టీకి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్లు దక్కినట్లు తెలిపింది. దీంతో జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.