ట్రంప్ ఫోన్ ట్యాప్ చేయలేదు: ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి..
హౌజ్ ఇంటలిజెన్స్ కమిటీ ఛైర్మన్ డెవిన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటలిజెన్స్ వర్గాలు 2016ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలపై, వ్యక్తులపై నిఘా పెట్టింది లేనిదీ దర్యాప్తు ద్వారా తేలుస్తామని అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి అధ్యక్షుడు ఒబామా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఒబామా ఆదేశాలతో ట్రంప్ ఫోన్ ట్యాప్ అయినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండించాల్సిందిగా ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమిని ఒబామా కోరారని ఆరోపణలున్నాయి.
ఒబామా ఆదేశాల మేరకు ఆరోపణలను తిరస్కరించాల్సిందిగా జస్టిస్ డిపార్ట్ మెంట్ ను జేమ్స్ కోమి కోరినట్లు చెబుతున్నారు. అయితే జేమ్స్ కోమి అభ్యర్థనపై అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. జేమ్స్ కోమి మాత్రం ట్యాపింగ్ ఆరోపణలను కొట్టిపారేశారు.
కాగా, గతేడాది ట్రంప్ టవర్స్ సమీపంలోని అన్ని ఫోన్లను ఎఫ్.బి.ఐ ట్యాప్ చేసినట్లుగా ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఆధారాల గురించి మాత్రం ట్రంప్ స్పందించకపోవడం గమనార్హం.
వైట్ హౌజ్ ప్రతినిధి సియాన్ స్పైసర్ దీనిపై స్పందించారు. అవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవే అని ఆయన అభిప్రాయపడ్డారు. 2016 ఎన్నికల్లో రాజకీయ జోక్యం జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లుగా తెలిపారు. హౌజ్ ఇంటలిజెన్స్ కమిటీ ఛైర్మన్ డెవిన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇంటలిజెన్స్ వర్గాలు 2016ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలపై, వ్యక్తులపై నిఘా పెట్టింది లేనిదీ దర్యాప్తు ద్వారా తేలుస్తామని అన్నారు.