జంట పేలుళ్లతో వణికిన కాబూల్ : 50 మందికి పైగా మృతి?
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
మరోవైపు ఈ జంట పేలుళ్లు తమ పనేనంటూ ఆఫ్ఘాన్ తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఎన్ డీ ఎస్ నుంచి సిబ్బందితో వెళ్తున్న మినీ బస్సు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.
కార్మికులు ఇళ్ళకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికార వర్గాల సమాచారం. చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హఠాత్తుగా జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది.
బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్నే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దారుల్ అమన్ ప్రాంతంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తానె పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
నిజానికి ఆఫ్ఘానిస్తాన్ పార్లమెంటు భావన నిర్మాణానికి భారత దేశమే సాయం చేసింది. మొదటి పేలుడు జరిగిన తర్వాత కొద్దిసేపటికే మరో కారు బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురైనట్లు అధికారులు చెప్పారు.