ఎలాగైనా ఎలాన్ మస్క్ చేతికే ట్విట్టర్: పావులు కదుపుతున్న మేనేజ్మెంట్: షేర్ హోల్డర్లతో ఓటింగ్
వాషింగ్టన్: ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్, ప్రముఖ ఎలక్ట్రానిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కష్టాలు మరింత పెరిగాయి. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చిన తరువాత తరచూ ఆయన వార్తల్లో వ్యక్తిగా ఉంటోన్నారు. మొన్నటికి మొన్న ఆయన తండ్రి ఎర్రాల్ మస్క్.. తన సవతి కుమార్తెతో అక్రమసంబంధాన్ని కొనసాగించి కలకలం రేపాడు.
ఆ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకే ఎలాన్ మస్క్ సైతం ఇదే తరహా వివాహేతర సంబంధంతో తెరమీదకి వచ్చాడు. టాప్ సెర్చింజిన్ గూగుల్ కో ఫౌండర్ సెర్గె బ్రిన్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆ తరువాత దీన్ని ఆయన తోసిపుచ్చారు. తనకెలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ లేవని స్పష్టం చేశాడు గానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పుడు మరోసారి ఎలాన్ మస్క్ వివాదాలకు కేంద్రబిందువు అయ్యాడు. ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల విలువ చేసే కొనుగోలు ఒప్పందాలపై ముందుకు వెళ్లాలని ట్విట్టర్ యాజమాన్యం నిర్ణయించుకుంది. దీనిపై షేర్ హోల్డర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించనుంది. ఓటింగ్ రూపంలో ఈ అభిప్రాయ సేకరణ ఉంటుంది. ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన ఈ డీల్పై సెప్టెంబర్ 13వ తేదీన షేర్ హోల్డర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించనున్నట్లు ట్విట్టర్ మేనేజ్మెంట్ తాజాగా ప్రకటించింది.
ఉదయం 10 గంటలకు వెబ్కాస్ట్ రూపంలో ఈ ఓటింగ్ ప్రారంభమౌతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ టాప్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు తన ప్రతిపాదనలను సమర్పించింది. ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఈ ఓటింగ్కు అర్హుడేనని తెలిపింది. ఈ సమావేశాన్ని లైవ్ ద్వారా చూసే అవకాశాన్ని వారికి కల్పించినట్లు పేర్కొంది. వెబ్ కాస్ట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వివరించింది.
ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన 44 బిలియన్ డాలర్ల డీల్కు అనుకూలమా? ప్రతికూలమా? అనే విషయం మీదే ఈ ఓటింగ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. మెజారిటీ షేర్ హోల్డర్లు గనక ఈ డీల్ను అనుకూలంగా మద్దతు ప్రకటిస్తే- ఆ తరువాతి పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారాయని చెబుతోన్నాయి. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి ఇదివరకే ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ట్విట్టర్ను కొనుగోలు చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.
దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. న్యాయపరమైన పోరాటాన్ని చేపట్టింది. ట్విట్టర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటీషన్ అక్టోబర్లో విచారణకు రానుంది. కాగా- ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన అనంతరం వెనక్కి తగ్గారు ఎలాన్ మస్క్.












Click it and Unblock the Notifications