ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్?: భారీ ఆఫర్కు తలొగ్గి, ఈరోజే తతంగమంతా పూర్తయ్యే ఛాన్స్
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నంత పనిచేసేలా కనిపిస్తున్నారు. ట్విట్టర్ను కొనుగోలు చేస్తానని బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించి పది రోజుల తర్వాత కీలక సానుకూల పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం టెస్లా సీఈఓతో ట్విట్టర్ బోర్డు చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ట్విట్టర్కు ఎలాన్ మస్క్ భారీ ఆఫర్
ఎలాన్ మస్క్ డీల్ కుదిరితే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, కాల వ్యవధి, ఖర్చులు వంటి కీలక అంశాలపై ఇరువర్గాలు చర్చించాయని ఈ అంశానికి సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపినట్లు ది టైమ్స్ వెల్లడించింది. పది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు చేసేందుకు 46.5 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇచ్చారు ఎలాన్ మస్క్. తొలుత ఈ ప్రతిపాదనను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ట్విట్టర్ బోర్డు సైతం తాము కంపెనీని విక్రయించే ప్రసక్తే లేదని స్పష్టమైన సంకేతాలిచ్చింది.
మస్క్ ఆఫర్కు మొదట నో అన్నా.. వెనక్కితగ్గిన ట్విట్టర్
అయితే, ఎలాన్ మస్క్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. తాను ఈ విషయంలో ఎంత స్పష్టతతో ఉన్నారో తెలియజేసేలా ఎప్పటికప్పుడు సంకేతాలిస్తూ వచ్చారు. చివరకు లావాదేవీకి కావాల్సిన నిధుల్ని కూడా సిద్ధం చేసుకున్నారు. కొనుగోలు సౌలభ్యం కోసం హోల్డింగ్ కంపెనీని కూడా రిజిస్టర్ చేయించారు. మస్క్ ముమ్మర ప్రయత్నాలకు ట్విట్టర్ కూడా సానుకూలంగా స్పందించాల్సి వచ్చింది. అంతేగాక, 'పాయిజన్ పిల్' వ్యూహంతో అడ్డుకట్ట వేయాలనకున్న యత్నాలన్నింటినీ ట్విట్టర్ దాదాపు పక్కన పెట్టేసింది.
ట్విట్టర్ను దక్కించుకునేందుకు ఎలాన్ మస్క్ రెడీ
షేర్హోల్డర్లు కూడా ఒత్తిడి తేవడంతో ట్విట్టర్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున మస్క్తో ట్విట్టర్ బోర్డు సమావేశమై ఒప్పందంపై చర్చించినట్లు తెలుస్తోంది. మస్క్ ఒక్కో ట్విట్టర్ షేరుకు 54.20 డాలర్ల చొప్పున 43 బిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ట్విట్టర్ బోర్డుతో సంబంధం లేకుండా టెండర్ ఆఫర్ ద్వారా ఆయన నేరుగా వాటాదారులతో చర్చలు జరపాలని నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు గత శుక్రవారం పలువురితో వీడియో కాల్ ద్వారా మాట్లాడినట్లు తెలిసింది.
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్..? ఇక లాంఛనమే..
ట్విట్టర్ మరింత అభివృద్ధికి వాక్ స్వేచ్ఛపై నియంత్రణలు ప్రతిబంధకంగా మారాయని.. వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమవుతూ వస్తోందని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాను ఆఫర్ చేసిన ధర కంటే మంచి విలువను తీసుకురావడం ప్రస్తుత ట్విట్టర్ యాజమాన్యానికి సాధ్యం కాదని కూడా స్పష్టం చేశారు. ఆదాయం కోసం ప్రకటనలపై ఆధారపడడాన్ని తగ్గించడం, పొడవైన ట్వీట్లను అనుమతించడం, ఎడిట్ బటన్ సహా పలు మార్పులను మస్క్ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. త్వరలోనే వీటిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా ఆయన అడుగులువేశారు. ట్విట్టర్ తన చేతికొస్తే.. ఎలాన్ మస్క్ తన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజే ఎలాన్ మస్క్.. ట్విట్టర్ యజమాని అవుతారని వార్తలు కూడా వస్తున్నాయి.