ఉక్రెయిన్ వార్ పై నేడు ఐరాస భేటీ-భద్రతామండలి తీర్మానం-వీటో చేయనున్న రష్యా
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రపై ప్రపంచ దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ ఉక్రెయిన్ గురించి పట్టించుకోని దేశాలు కూడా ఇప్పుడు యుద్ధాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. అలాగే ప్రపంచ దేశాల మధ్య సఖ్యతకు ప్రయత్నించాల్సిన ఐక్యరాజ్యసమితి ఏం చేస్తోందన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దీంతో ఇవాళ ఉక్రెయిన్ పై పరిస్ధితిపై చర్చిచేందుకు ఐరాస భద్రతా మండలి భేటీ అవుతోంది.
ఉక్రెయిన్ యుద్ధంపై ఐరాస భేటీ
ఉక్రెయిన్ లో సైనిక చర్య ప్రారంభించిన రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రపంచ దేశాలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, దాని మిత్రదేశాలు రష్యాను ఒంటరి చేసే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితిలో రష్యా వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలో దురాక్రమణకు దిగిన రష్యా తీరును నిరసిస్తూ తయారు చేసిన తీర్మానం ఇవాళ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై భద్రతా మండలిలో 15 సభ్యదేశాలుప తమ వాదన వినిపించబోతున్నాయి.
ఐరాసలో ఏం జరగబోతోంది ?
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండించే ముసాయిదా తీర్మానంపై ఓటు వేయనుంది. అళాగే మాస్కో తక్షణమే బేషరతుగా ఉక్రెయిన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరబోతోంది. ఐరాస తీర్మానాన్ని రష్యా పట్టించుకుంటుందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే ప్రపంచ పెద్దన్నగా ఐక్యరాజ్యసమితి అధికారికంగా చేపట్టే ఈ చర్య రష్యాపై కచ్చితంగా ఒత్తిడి పెంచే అవకాశముంది.
వీటో చేయనున్న రష్యా
ఉక్రెయిన్ లో రష్యా తీరుకు నిరసనగా భద్రతా మండలిలో అమెరికా, దాని మిత్రదేశాలు ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే రష్యాకు భద్రతా మండలిలో వీటో అధికారాలు ఉండటంతో ఈ తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే అమెరికా రూపొందించిన తీర్మానాన్ని 193 మంది సభ్యుల ఐరాస సాధారణ సభలో కొన్ని రోజుల వ్యవధిలో చర్చ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు మిత్రరాజ్యాలు పావులు కదుపుతున్నాయి.
Recommended Video
రష్యాను ఒంటరి చేసేందుకే
15 సభ్యుల ఐరాస భద్రతా మండలిలో అమెరికా, దాని మిత్ర రాజ్యాలు ప్రవేశపెట్టే తీర్మానం వీగిపోయినా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇధి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. భద్రతామండలిలో తీర్మానం వీగినా అమెరికా, దాని మిత్రపక్షాలు మాత్రం రష్యాను ఒంటరి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి. ఈ తీర్మానంపై కనీసం 11 మంది దౌత్యవేత్తలైన సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని తెలుస్తోంది. అయితే చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేసే ఓటుపై సందిగ్ధం నెలకొంది.