భారత్కు వెంటిలేటర్లు,మెడికల్ ఎక్విప్మెంట్... కష్ట కాలంలో సాయం అందిస్తున్న బ్రిటన్...
కరోనాతో అల్లాడుతున్న భారత్కు సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే యూకె,అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్,ఆస్ట్రేలియా దేశాలు సాయం చేస్తామని ప్రకటించాయి. తాజాగా యూకె భారత్కు వెంటిలేటర్లు,ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,మెడికల్ ఎక్విప్మెంట్ పంపిస్తామని వెల్లడించింది. మొత్తం 600 మెడికల్ పరికరాలతో కూడిన మొదటి షిప్ బ్రిటన్ నుంచి మంగళవారం(ఏప్రిల్ 27) భారత్ చేరనుంది. ఇందులో 495 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,120 నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్లు,20 మాన్యువల్ వెంటిలేటర్లు ఉండనున్నాయి.
'భారత్తో మా స్నేహం,భాగస్వామ్యం రీత్యా కోవిడ్పై పోరులో మేము ఆ దేశానికి అండగా నిలబడుతాం. మహమ్మారిపై పోరాటంలో అంతర్జాతీయ సమాజానికి బ్రిటన్ తరుపున చేయాల్సిందంతా చేస్తాం.' అని బ్రిటన్ వెల్లడించింది. మున్ముందు భారత్కు ఎలాంటి సహాయం అవసరమైనా అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది.
బ్రిటన్ సెక్రటరీ డొమినిక్ రాబ్ మాట్లాడుతూ... 'ఈ క్లిష్ట సమయంలో మా భారత స్నేహితులకు మేము మెడికల్ ఎక్విప్మెంట్ అందిస్తున్నాం. కరోనాను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి కట్టుగా పోరాడాలి. భారత్ మాకు కీలక భాగస్వామిగా ఉన్నందునా... అవసరమైన సాయం అందించేందుకు మేము సిద్దంగా ఉన్నాం.' అని తెలిపారు.
యూకె హెల్త్ అండ్ సోషల్ కేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మట్ హన్కాక్ మాట్లాడుతూ.. భారత్లో కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని అన్నారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతోందన్నారు. బ్రిటన్ నుంచి భారత్కు మెడికల్ ఎక్విప్మెంట్ తరలించేందుకు కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
నిజానికి వచ్చే వారంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించాల్సి ఉంది. కానీ భారత్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన పర్యటనను విరమించుకున్నారు. యూకె సహా ఇప్పటికే పలు దేశాలు భారత్కు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిషేధించాయి. కేవలం మెడికల్ ఎక్విప్మెంట్కు సంబంధించిన విమానాలు మాత్రమే ఆయా దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో భారత్లో 3.49లక్షల కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అంతకుముందు,శనివారం 3.46లక్షలు,శుక్రవారం 3.32లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం ఇప్పటికే చాలా రాష్ట్రాలు వీకెండ్ లాక్డౌన్,నైట్ కర్ఫ్యూ పాటిస్తున్నాయి.