హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ బిగ్ షాక్!
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు పాకిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. హఫీజ్ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి సంబంధించిన సంస్థలపై నిషేధం విధించింది.
గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్కు చెందిన లష్కర్-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలపై పాక్షిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే ఆయా సంస్థలకు నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్.. ఇప్పుడు వాటిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్ను గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని పాకిస్తాన్ గృహ నిర్భంధంలో కూడా ఉంచింది.
అయితే ఆ తరువాత లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. అయితే పాక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హఫీజ్ సయీద్కు ఊహించని దెబ్బే.
1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసిన పాకిస్తాన్.. తాజాగా మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ పై సంతకం చేసినప్పటికీ.. అధికారులు సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఈ ఆర్డినెన్స్ అమలులోకి రావడంతో తక్షణమే హఫీజ్ సయీద్కు చెందిన సంస్థలపై ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్ను అరెస్ట్ చేసే విషయంపై మాత్రం పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.