రోదసిలో Sunita Williamsను వెంటాడుతున్న కష్టాలు..అతిపెద్ద ఆరోగ్య సమస్య ఇదే..!!
Sunita Williams:జూన్ నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు చేరుకున్నారు. 8 రోజుల తర్వాత వారు భూమికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వారిని గమ్యం చేర్చే వ్యోమనౌక బోయింగ్ స్టార్లైర్లో కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది ఎలన్ మస్క్ సంస్థకు చెందిన ఎక్స్ వ్యోమనౌకలో వారు భూమికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది.
స్పేస్ అనేమియా ఏంటి..?
జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన నెలకొంది. ఇంకా కొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి ఉండటంతో వారు స్పేస్ అనేమియా బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతీ స్పేస్ అనేమియా అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నసమయంలో వారి శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు (Red Blood cells) సంఖ్య క్రమంగా తగ్గిపోతాయి. ఈ పరిస్థితినే మెడికల్ పరిభాషలో స్పేస్ అనేమియా అని పిలుస్తారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక ఎర్ర రక్త కణాలను శరీరం వేగంగా ధ్వంసం చేస్తుంది. అంతరిక్షంలో అతి తక్కువ స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పటికీ ఎర్ర రక్త కణాలను వేగవంతంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం శరీరానికి ఉండదు.

తగ్గనున్న ఎర్ర రక్త కణాలు
సాధారణంగా భూమిపై అయితే మానవ శరీరం ప్రతి సెకనుకు 2 మిలయన్ల ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంతో పాటు ధ్వంసం కూడా చేసే కెపాసిటి ఉంటుంది.ఇప్పుడు దాదాపుగా 6 నెలల సమయం వ్యోమగాములు అంతరిక్షంలో గడపాల్సి రావడంతో వారి శరీరంలో సెకనుకు 3 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ధ్వంసం అవుతున్నట్లు నేచర్ మెడిసిన్ అనే సంస్థ చేసిన ఒక స్టడీ ద్వారా వెల్లడైంది. అంటే వారు అంతరిక్షంలోకి వెళ్లక ముందు అంతరిక్షంలోకి వెళ్లాక పోల్చితే ఇది 54శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే వ్యోమగామి అంతరిక్షంలోకి ఎంట్రీ ఇవ్వగానే ఎర్ర రక్త కణాలు తగ్గే ప్రక్రియ ప్రారంభం అవుతుందని నాసా ఒక నివేదికలో పేర్కొంది. ఎర్ర కణాలను ధ్వంసం చేయడం ద్వారా అప్పటికే తక్కువ స్థాయిలో ఉన్న ఆక్సిజన్కు శరీరం అడ్జస్ట్ అవుతుందని నాసా వివరించింది.
శరీరంలో మార్పులు
ఇక శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల వ్యోమగాములు బలహీనపడటం, ఎర్ర రక్త కణాలు లేకపోవడంతో అనేమియాకు గురికావడం దీంతో వారు చేయాల్సిన పనులలో వేగం తగ్గడం, నీరసించిపోవడం వంటివి జరుగుతాయి. ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడానికి కారణం వ్యోమగామి తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పుడు శరీరంలోని ఫ్లూయిడ్లలో మార్పు రావడంతో రక్తం కూడా తగ్గిపోతుందని దీనిపై పరిశోధన చేసిన పరిశోధకులు తొలుత భావించారు. కానీ ఇది తప్పని తేలింది. వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నంత కాలం ఎర్ర రక్త కణాలు క్రమంగా తగ్గిపోతాయని వారు ధృవీకరించారు. ఈ ప్రక్రియనే హెమాలిసిస్ అని పిలుస్తారని యూనివర్శిటీ ఆఫ్ ఒట్టావాకు చెందిన పరిశోధకుడు గై ట్రూడెల్ చెప్పారు. రక్త కణాలు ధ్వంసం అవడం వ్యోమగామి భూమికి చేరిన తర్వాత కూడా కొన్ని రోజులు జరుగుతుందని వెల్లడించారు.

భూమికి చేరిన తర్వాత కూడా..
ఇక రక్త కణాలు తిరిగి పెద్ద సంఖ్యలో ఉత్పత్తి కావాలంటే వ్యోమగాములు మంచి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అంతరిక్షంలో ఉన్న సమయంలో ఎర్ర రక్త కణాలపై నియంత్రణ కోల్పోతే ఈ ప్రభావం వ్యోమగామి యొక్క ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఇప్పుడు వారి ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ చూపాలని వారు సూచిస్తున్నారు. వారికి మంచి పోషకాహారం అందించే వ్యూహాన్ని అమలు చేయాలని చెబుతున్నారు.ఇక భూమిపైకి వ్యోమగాములు చేరగానే స్పేస్ అనేమియా ఇంకా వారిని వెంటాడుతూనే ఉంటుందని చెప్పారు.
సునీత పరిస్థితి ఎలా ఉంది..?
ఇక సునీతా విలియమ్స్ విషయానికొస్తే... ఆమె ఎముకలు బలహీన పడటం,కండరాల బలహీనత,గుండె శ్వాస సంబంధిత సమస్యలు కంటి చూపు సమస్యలు వస్తాయని గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మరియు చీఫ్ బీఎంటీ డాక్టర్ రాహుల్ భార్గవ వివరించారు. రోదసిలో ఉండే సూక్షస్థాయి గురుత్వాకర్షణ శక్తికి శరీరం అలవాటు పడిపోవడం వల్ల రక్తపోటు, గుండె పనితీరులో మార్పలు చోటు చేసుకుంటాయని చెప్పారు. దీంతో భూమికి చేరుకోగానే గుండె శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కొందరు వ్యోమగాములు కంటి చూపు సమస్యల గురించి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయితే దీనికి గల కారణాలను మరింత లోతుగా విశ్లేషించే పనిలో పరిశోధకులు ఉన్నారు.

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని వారాల సమయం తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యోమగాములు రోదసిలో ఎంత కాలం ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక స్పేస్ అనేమియాతో వ్యోమగాములు దీర్ఘకాలంలో ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందో అనే అంశంపై లోతుగా స్టడీ చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇక త్వరలోనే అంగారకుడిపైకి మానవుడిని పంపాలన్న యోచన చేస్తున్న నాసా దీనిపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications