అమెరికాలో హోరాహోరీ: విక్టరీ పార్టీకి ట్రంప్ రెడీ
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరా హోరీగా జరిగింది. పోటీపోటీగా సాగిన డిబేట్లు ముగిసిపోయాయి. ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. నాలుగేళ్లకు ఒక సారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి కొన్ని రోజులే గడువు ఉంది.
సీబీఎన్ న్యూస్/న్యూయార్క్ టైమ్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ కు 45 శాతం, డోనాల్డ్ ట్రంప్ కు 42 శాతం ఓట్లు వస్తాయని వెలుగు చూసింది. ఇద్దరి మధ్య కేవలం మూడు శాతం ఓట్లు తేడా ఉండటంతో అమెరికన్లలో ఉత్కంఠ నెలకొంది.
అదేవిధంగా సీఎన్ఎన్/ఓఆర్ సీ సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కు ఐదు శాతం ఓట్లు ఎక్కువగా వస్తాయని వెలుగు చూసింది. పలు సర్వేల్లో హిల్లరీ క్లింటన్ వైపు తాము మొగ్గు చూపుతున్నామని ఓటర్లు చెప్పారని, ఆమె ఆధిక్యంలో ఉన్నారని వెల్లడించాయి.
విజయోత్సవాలకు ట్రంప్ రెడీ.... ప్లేస్ చెప్పేశారు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం (నవంబర్ 8)న జరగనున్నాయి. అయితే ఇంకా గడువు ఉన్నా అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయోత్సవాలకు సిద్దం అయిపోయారు. మంగళవారం రాత్రి తన మద్దతుదారులకు, స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించారు.
న్యూయార్క్ లోని మన్ హట్టన్ లోని ఓ ఖరీదైన హోటల్ లో ఘనంగా విక్టరీ పార్టీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ట్రంప్ ప్రచారకర్తలు ప్రకటించారు. అదే రోజు న్యూయార్క్ లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ కూడా తన మద్దతుదారులకు ఓ పార్టీ ఇవ్వనున్నారు.
అయితే ట్రంప్ ఇస్తున్న విక్టరీ పార్టీ లాంటిది కాదని హిల్లరీ క్లింటన్ ప్రచారకర్తలు అంటున్నారు. తాము విక్టరీ పార్టీ అని పేరుపెట్టలేదని, మామూలుగా విందు ఇస్తున్నామని వారు చెప్పారు. ట్రంప్ అనుచరులు మాత్రం తాము విక్టరీ పార్టీ ఇస్తున్నామని స్థానిక మీడియాకు చెప్పారు.
69 శాతం మంది ఓట్లు వేస్తున్నారు
అమెరికాలో ఓట్లు వేసే అర్థత ఉన్న వారు 21.89 కోట్ల మంది. అందులో ఇప్పటికే 14.75 కోట్ల మంది ఓటు వెయ్యడానికి నమోదు చేసుకున్నారు. వారిలో తాము ఓటు వెయ్యడానికి సిద్దంగా ఉన్నామని 69 శాతం మంది స్పష్టం చేశారు.
అమెరికాలో 5.7 శాతం మంది ఆసియా దేశాల ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2010 అమెరికా జనాభా లెక్కల ప్రకారం ఆదేశంలో చైనీయులు ఎక్కువగా ఉన్నారు.
మొదటి స్థానంలో చైనీయులు 37.9 లక్షల మంది, రెండో స్థానంలో ఫిలిప్పీన్స్ వాసులు 34 లక్షల మంది, మూడో స్థానంలో భారతీయులు 31.8 లక్షల మంది ఉన్నారు. అయితే అందరి కళ్లు భారతీయుల మీదే ఉన్నాయి.
65 శాతం మంది భారతీయులు ఎవరి వైపు అంటే ?
అమెరికాలో ఉన్న భారతీయుల్లో 60 శాతం మంది ఓటింగ్ లో పాల్గోంటారని అంచానా వేశారు. భారతీయ ఓటర్లు మాత్రం 65 శాతం మంది డెమోక్రాటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్యూ రిసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెలుగు చూసింది.
వేరే దేశాల నుంచి వలస వచ్చిన వారు అమెరికన్ల ఉద్యోగాలను ఎగరేసుకు వెలుతున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను దేశాధ్యక్షుడు అయితే ఇమ్మిగ్రేషన్ విధానాన్ని పూర్తిగా మార్చి వేస్తానని ప్రచారంలో బహిరంగంగా చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలతో భారతీయులతో పాటు ఆసియన్ అమెరికన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కుతో ట్రంప్ కు బుద్ది చెప్పాలని నిర్ణయించారు. ఈ విషయం గుర్తించిన ట్రంప్ తరువాత భారతీయులను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించారు.