భారత్కు హక్కుంది: అమెరికా అండ, పాక్కు చురకలు
కరాచీ: యూరి ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ ఎల్వోసీని దాటి పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించింది. దీని పైన ఆమెరికా భారత్కు అండగా నిలబడింది. అదే సమయంలో కాశ్మీర్లో శాంతికి, ఆప్ఘనిస్తాన్లో శాంతికి పాకిస్తాన్ పొంతన పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూరి ఘటన నేపథ్యంలో భారత్కు ఆత్మరక్షణ హక్కుందని అమెరికా తెలిపింది. అఫ్గాన్లో శాంతికీ, కాశ్మీర్ అంశానికీ ముడిపెట్టేందుకు పాకిస్థాన్ చేసిన యత్నాలను కొట్టిపారేసింది. భారత్, అమెరికాలవి అత్యంత చలనశీల సంబంధాలని వైట్ హౌస్లో దక్షిణాసియా వ్యవహారాలకు సంబంధించిన అధికారి పీటర్ లావోయ్ పేర్కొన్నారు.
యూరీ ఘటన సీమాంతర ఉగ్రవాదమనేది స్పష్టమని పేర్కొంది. ఆ ఉగ్రచర్యను ఖండిస్తున్నామన్నారు. ప్రతి దేశానికీ స్వీయరక్షణ హక్కు ఉంటుందని చెప్పారు. భారీస్థాయిలో సైనిక మోహరింపులతో కూడిన సంబంధాలు ఇప్పటికే మూడు యుద్ధాలు చూశాయనీ, నిగ్రహంతో ఉండాలన్నారు. భారత్కు ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం కృషి చేస్తున్నామన్నారు.
కాగా, భారత్ పైన దండయాత్ర చేసేందుకు అనుమతివ్వాలని, ఈ దండయాత్రతో కాశ్మీర్ను స్వాధీనం చేసుకుందామని జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్తాన్ను కోరాడు. భారత్ సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతీకార దాడులకు అనుమతివ్వాలని కోరాడు.
భారత సైనిక స్థావరాలపై దాడులను జరిపేందుకు తమను అనుమతించాలన్నాడు. జైష్ ఏ వార పత్రికలో ఆయన ఓ కథనాన్ని రాశాడు. ఇందులో కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. కాశ్మీర్ను పూర్తిగా ఆక్రమించుకునేలా చారిత్రక అవకాశం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లో ఉందన్నాడు.
నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైతే అవకాశం చేజారుతుందని చెప్పాడు. భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్ దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే అవకాశం కల్పించాలని, అందుకు కాశ్మీర్ను కానుకగా తెచ్చిస్తామన్నాడు. కొంచెం ధైర్యం చూపితే కాశ్మీర్ సమస్య, నీటి వివాదాలు తొలగిపోతాయన్నాడు. ముజాహిద్దీన్లకు దారివ్వాలని, ఆపై ఏం జరుగుతుందన్నది దేవుడి దయగా చెప్పాడు.