కరోనా విలయం: అమెరికాలో భయానకం.. రోగులకు క్రిమిసంహారక ఇంజెక్షన్లు.. ట్రంప్కు పిచ్చెక్కిందంటూ..
తుంటరి పిల్లాడిలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వింత వాదనలు అమెరికన్లలో భయాలను రెట్టింపు చేస్తున్నాయి. కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటికే ప్రపంచంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశంగా కొనసాగుతోన్న అమెరికాలో మరణాలు 50 వేల మార్కును దాటాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. వైరస్ ఉధృతి తగ్గకముందే చాలా రాష్ట్రాలు బిజినెస్ రీఓపెనింగ్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇలాంటి గందరగోళం నడము వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

రోగులకు ఆ ఇంజెక్షన్లు..
కరోనా నియంత్రణ కోసం ఫెడరల్ ప్రభుత్వం చేపడుతోన్న చర్యల్ని మీడియాకు వివరించిన ట్రంప్.. ఎండలో కరోనా వైరస్ బతకలేదని, అతినీలలోహిత(ఆల్ట్రా వయెలెట్) కిరణాలతో దాన్ని సంహరించొచ్చని, అదీకాకుంటే, కొవిడ్-19 రోగుల శరీరాల్లోకి క్రిమిసంహారక మందుల్ని ఇంజెక్ట్ చేసైనా సరే వైరస్ ను అంతం చేయొచ్చని, ఈ మేరకు ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రెసిడెంట్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా సైంటిస్టులు, డాక్టర్లు గొల్లుమన్నారు. ప్రజలు బెంబేలెత్తిపోతున్నవేళ ఇలాంటి ప్రమాదకర ప్రకటనలు చేయడం సరికాదని, ప్రెసిడెంట్ గా ఉంటూ పిచ్చిపట్టినట్లు వ్యవహరించడం సరికాదని తిట్టిపోశారు..

ట్రంప్ బ్లండర్ మిస్టేక్..
అతినీలలోహిత కిరణాలు, క్రిమిసంహారక మందులతో కరోనా వైరస్ ను అంతం చేయొచ్చన్న ట్రంప్ వాదన కరెక్టేకానీ, అది ఉపరితల వస్తువుల వరకే వర్తిస్తుంది. కిరణాలను, క్రిమిసంహారకాల్ని నేరుగా రోగులపైనే ప్రయోగిస్తే.. కరోనా వైరస్ తోపాటు కణజాలం కూడా చనిపోయి రోగులు ప్రాణాలు కోల్పోతారు. ఇంత చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ట్రంప్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని డాక్టర్లు, సైంటిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మిస్టర్ ట్రంప్, మీరు కెమిస్ట్రీలో వీక్ అని అందరికీ తెలుసు. కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించి, కణజాలంలో తిష్టవేస్తుంది. ఆల్ట్రా వాయలెట్ కిరణాలనో, క్రిమిసంహారక ఇంజెక్షన్లనో వాడితే రోగులు చనిపోతారు''అని లూరీ గారెట్ అనే వైద్యురాలు హెచ్చరించారు. తీవ్రమైన ఎండలో కరోనా బతకదన్న థియరీ కూడా తప్పేనని ఇటీవల సింగపూర్ సైంటిస్టులు నిర్ధారించిన విషయాన్ని ఇంకొందరు డాక్టర్లు గుర్తుచేశారు.

ప్రెసిడెంట్కు షాకిస్తూ రీఓపెనింగ్..
కరోనా నేపథ్యంలో మూతపడ్డ వ్యాపార, వాణిజ్యాలను రీఓపెనింగ్ చేసే విషయంలో ఫెడరల్ ప్రభుత్వానికి, రాష్ట్రాల గవర్నర్లకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాను చెప్పేదాకా రీఓపెనింగ్ చేయొద్దని ప్రెసిడెంట్ ట్రంప్ పదేపదే హెచ్చరించినా, జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్.. తన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ప్రకటించేశారు. జార్జియాలో 20వేలకు పైగా కొవిడ్ కేసులు ఉండగా, సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. మిషిగన్ రాష్ట్రంలోనైతే లాక్ డౌన్ ఎత్తేయాలంటూ ప్రజలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. చాలా రాష్ట్రాలు రీ ఓపెనింగ్ కు మొగ్గుచూపుతుండటం గమనార్హం.

24 గంటల్లో 2416 మరణాలు..
అమెరికాలో గడిచిన 24 గంటల్లో కొవిడ్-19 కారణంగా 2416 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 50,370కి పెరిగింది. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 9 లక్షలకు చేరువైంది. దాదాపు 90 వేల మంది ఇప్పటికే రికవరీ అయిపోగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవాళ్లలో 15వేల మంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. న్యూయార్క్ స్టేట్ లో అత్యధికంగా 21వేల మంది ప్రాణాలు కోల్పోగా, న్యూజెర్సీలో 5,426, మిషిగన్ (3వేలు), మసాచుసెట్స్(2,360) కాలిఫోర్నియా(1533) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి కనీసం 3కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడైంది.












Click it and Unblock the Notifications