అమెరికాలో అర్ధరాత్రి ఓటింగ్: ఆ కుగ్రామంలోని ఓట్లన్నీ గంపగుత్తగా ఒకరికే: బోణీ చేసిందెవరంటే?
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో పోలింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఆ దేశ కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి దాటిన అయిదు నిమిషాలకే ఓట్లు పోల్ అయ్యాయి. ఓటర్లు బ్యాలెట్ పేపర్లపై సంతకం చేయడంతో ఈ ప్రక్రియ ఆరంభమైంది. లెక్కింపు కూడా పూర్తయింది. అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడి ఓట్లన్నీ గంపగుత్తగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్కే పోల్ అయ్యాయి. అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితం జో బిడెన్కు అనుకూలంగా వెలువడింది. దీనితో ఆయన బోణీ కొట్టినట్టయింది.
న్యూ హ్యాంప్షైర్ స్టేట్లోని ఓ మినీ టౌన్షిప్ డిక్స్విల్లే నాక్లో అర్ధరాత్రి దాటిన అయిదు నిమిషాల తరువాత పోలింగ్ ప్రారంభమైంది. ఈ మినీ టౌన్షిప్లో అయిదు ఓట్లు పోల్ అయ్యాయి. అవన్నీ జో బిడెన్కే పడ్డాయి. అమెరికా-కెనడా సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది ఈ డిక్స్విల్లే నాక్. పర్యాటకులు ఎక్కువగా వచ్చిపోతుంటారిక్కడికి. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య ఉండే కుగ్రామం ఇది. దీన్ని గ్రామం అనీ అనలేం. మొత్తం 12 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఇక్కడి బల్సామ్స్ రిసార్ట్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అయిదు ఓట్లు పోల్ అయ్యాయి. వెంటనే వాటిని లెక్కించారు. 2016లో కూడా ఈ మినీ టౌన్షిప్లోని ఓట్లన్నీ డెమొక్రటిక్ పార్టీకే పడ్డాయి. అప్పట్లో డిక్స్విల్లే నాక్ ఓటర్లు.. డెమొక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్కు ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అదే సంప్రదాయం ఈ సారి కూడా కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ మినీ టౌన్షిప్నకు ఆనుకునే ఉండే మరో టౌన్ మిల్స్ఫీల్డ్లో పోలింగ్ ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ రెండు ప్రాంతాలను కలిపి మొత్తం 48 ఓట్లు పోల్ కావాల్సి ఉంది. ఇందులో తొలుత డిక్స్విల్లే నాచ్లో అయిదు ఓట్లు పడ్డాయి. 2016 ఎన్నికల్లో మిల్స్ఫీల్డ్లో డొనాల్డ్ ట్రంప్కు మెజారిటీ ఓట్లు పోల్ అయ్యాయి. ఆయనకు 16 ఓట్లు పడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఈ సారి ఫలితం ఎలా ఉంటుందనేది కాస్సేపట్లో తేలిపోతుంది.












Click it and Unblock the Notifications