ఇంకా ఎంత సేపు ఆగాలి? ఎన్నికల ఫలితాల ఆలస్యానికి కారణాలివే -చివరికి విజేత ఎవరంటే
అమెరికా ఎన్నికల ఫలితాల కోసం సెర్చ్ చేసిన వాళ్లందరూ ''జోబైడెన్ 238.. ట్రంప్ 213'' అనే ఫిగర్ చూసి, చూసి విసుగుచెంది ఉంటారు. కొద్ది గంటలుగా ఆ సంఖ్యలో మార్పు లేకపోవడం.. అందరిలో అసహనాన్ని పెంచుతోంది. అదే సమయంలో అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోందనే ఆసక్తిని కూడా రెట్టింపు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న అమెరికా ఎన్నికల ఫలితాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో, ఇప్పటి తాజా పరిస్థితి ఏంటో, విజేతలుగా నిలిచే అవకాశం ఎవరికి ఉందో ఒక్కసారి పరిశీలిస్తే..
అట్టుడుకుతోన్న అమెరికా: వైట్హౌస్ దగ్గర కత్తిపోట్లు -అన్ని సిటీల్లో నిరసనలు -ఆజ్యంపోసిన ట్రంప్
ఆ 7 రాష్ట్రాల వల్లే..
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలుండగా, మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే అన్ని చోట్లా కౌంటింగ్ ప్రారంభమైంది. బుధవారం తెల్లవారుజాము వరకు మెజార్టీ రాష్ట్రాల్లో ఫలితాలు వెలవడగా.. ఏడు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి (2020) ఎన్నికల్లో సగానికిపైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ రూపంలో పడటం, వాటిని లెక్కించే విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు ఉండటం ఆలస్యానికి అసలు కారణం. అంటే.. ఎలక్షన్ డే(మంగళవారం) తర్వాత కూడా తమకు చేరే ప్రతి పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించిన తర్వాతే తుది ఫలితం ప్రకటించాలని పెన్సిల్వేనియా సహా మరికొన్ని రాష్ట్రాల్లో నిబంధన ఉంది. ప్రస్తుతానికి పోస్టులు రావడం ఆగిపోయినా, వచ్చిన వాటి సంఖ్య భారీగా ఉండటం, వాటి కౌంటింగ్ ను మంగళవారం రాత్రి నుంచే మొదలుపెట్టినందున కౌంటింగ్ ఆలస్యమవుతోంది. కానీ..
విజేతను నిర్ణయించేది ఇవే..
బుధవారం తెల్లవారిన తర్వాత కూడా కౌంటింగ్ కొనసాగడం అమెరికాలో చాలా అరుదు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోన్న ఆ ఏడు రాష్ట్రాలే అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరేది నిర్ణయించబోతున్నాయి. 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, ఇప్పటివకు బైడెన్ 238, ట్రంప్ 213 ఓట్లు సాధించారు. ఫలితాలు రావాల్సిన 7 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 86 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఇంకా ఫలితాలు రావాల్సిన రాష్ట్రాల్లో రెండు (నెవెడాలో 6 ఎలక్టోరల్ ఓట్లు, అలస్కాలో 3 ఎలక్టోరల్ ఓట్లు) తప్ప మిగతా ఐదూ పెద్దవే కావడంతో వాటిపైనే ఫోకస్ పెరిగింది.
ఇదీ తాజా పరిస్థితి..
ఇంకా కౌంటింగ్ కొనసాగుతోన్న ఆ ఐదు కీలక రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు, ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాలు(పోస్టల్ బ్యాలెట్ కాకుండా) ఇలా ఉన్నాయి. జార్జియాలో మొత్తం 16 ఎలక్టోరల్ ఓట్లుంగా ఇక్కడ 94 శాతం పోలింగ్ నమోదైంది. తుది సమాచారం వెలువడే నాటికి ట్రంప్ 50.5 శాతం ఓట్లతో లీడ్ లో ఉన్నారు. బైడెన్ 48.3 ఓట్లు సాధించారు. ఇక మిచిగన్ లో 16 ఎలక్టోరల్ ఓట్లు, 94 శాతం పోలింగ్, బైడెన్-49.3 శాతం ఓట్లు, ట్రంప్ 49.1శాతం ఓట్లు సాధించారు. అదే నార్త్ కరోలినాలో 15 ఎలక్టోరల్ ఓట్లకుగానూ 94 శాతం పోలింగ్ జరగ్గా ట్రంప్ 50.1, బైడెన్ 48.7 శాతం ఓట్లు రాబట్టారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతోన్న మరో రాష్ట్రం పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. ఇక్కడ 64 శాతం పోలింగ్ నమోదైనా, మెజార్టీ ఓట్లు పోస్టల్ ద్వారానే వచ్చాయి. తుది సమాచారం అందేనాటికి ట్రంప్ 55.7 శాతం ఓట్లు, బైడెన్ 43.1శాతం ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిస్ లో 10 ఎలక్టోరల్ ఓట్లకు 95 శాతం పోలింగ్ జరగ్గా, బైడెన్ 49.6 శాతం, ట్రంప్ 48.9 శాతం ఓట్లు సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ను పూర్తిగా లెక్కిస్తే ఈ సంఖ్యలు మారిపోతాయి. తద్వారా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. కాగా,
అందుకే ట్రంప్ విక్టరీ ప్రకటన..
బుధవారం తెల్లవారు దాకా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడాన్ని ట్రంప్ తప్పు పడుతున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ అవకతవకలు జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తూ, అందుబాటులో ఉన్న ఫలితాలను ప్రకటించేయాలని డిమాండ్ చేశారు. ఆ లెక్కన చూస్తే తుది ఫలితం వెలువడని రాష్ట్రాల్లో ఆయనే ట్రంపే ముందంజలో ఉంటారు. కానీ పోస్టల్ బ్యాలెట్లను పూర్తిగా లెక్కించిన తర్వాత ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని డెమోక్రాట్లు విశ్వసిస్తున్నారు. బైడెన్ మద్దతుదారుల్లో చాలా మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసి ఉండం గమనార్హం. కాబట్టే చివరి ఓటును కూడా లెక్కించిన తర్వాతే పైనల్ రిజల్ట్ డిక్లెర్ చేయాలని, లేదంటే న్యాయపోరాటానికి తామూ సిద్ధమని డెమోక్రాట్లు ప్రకటించారు. కౌంటింగ్ కొనసాగుతోన్న ఏడు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నానికి(అమెరికా కాలమానం ప్రకారం) ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, పెన్సిల్వేనియాలో మాత్రం శుక్రవారం నాటికిగానీ రిజల్ట్స్ రాబోవని అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది..
షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసి