ఈ దేశాన్ని న్యాయమూర్తులు పరిపాలించాలనుకుంటున్నారు: కౌంటింగ్ మొత్తం కుట్రే: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షఎన్నికల ఫలితాలు ముగింపు దశలో ఉన్నవేళ..చివరిదశలో ఆధిక్యతలో ఉన్న కొన్ని రాష్ట్రాలను ప్రత్యర్థి పార్టీకి కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆయన తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపులో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. చట్టపరంగా పోరాడుతున్నప్పటికీ. న్యాయం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నైతిక విజయం తమదే.. అయినా
ఈ దేశాన్ని న్యాయమూర్తులు పరిపాలించాలనుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఆయన తన అధికారిక నివాసం వైట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కౌంలింగ్ ప్రక్రియ పట్ల అసహనాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని తేల్చి చెప్పారు. నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా ఓట్లను లెక్కిస్తే.. తాము విజయం సాధించినట్లు భావించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
న్యాయబద్ధంగా ఓట్లను లెక్కించట్లేదు..
అన్యాయంగా, మార్గదర్శకాలకు విరుద్ధంగా కౌంటింగ్ను నిర్వహిస్తున్నారని, తమ నుంచి విజయాన్ని దొడ్డిదారిన లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. లీగల్గా ఓట్లను లెక్కిస్తే.. తాము సులువుగా విజయం సాధించినట్టేనని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తమకు ప్రతికూలంగా ఉన్న రాష్ట్రాల్లో విజయం సాధించామని, ఇదివరకు ఎప్పుడూ లేనంతగా ఓట్లను సాధించానని, రికార్డు స్థాయిలో ఓట్లు పోల్ అయ్యాయని అన్నారు.
కౌంటింగ్లో అక్రమాలు..
కౌంటింగ్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేసరికి.. దీనిపై పలు కేసులు దాఖలయ్యే అవకాశాలు లేకపోలేదని అన్నారు. అడ్డదారుల్లో విజయం సాధించాలని తాము కోరుకోవట్లేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తాను, జో బిడెన్.. కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించిన మాట వాస్తవమేనని, అది ప్రజలు ఇచ్చిన తీర్పు అని చెప్పారు.
కుట్రలను సాగినివ్వొద్దు..
జార్జియాలో ఓట్ల లెక్కింపు వ్యవహారాన్ని తప్పు పడుతూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు దాఖలు చేసిన పిటీషన్ను అక్కడి న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై స్పందించారు. చివరికి- ప్రజా తీర్పునకు విరుద్ధంగా న్యాయమూర్తులు అమెరికాను పరిపాలించానుకుంటున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కుట్రపూరితంగా సాగిందని పునరుద్ఘాటించారు. ప్రజల తీర్పును పక్కదారి పట్టించే అలాంటి కుట్రలను సాగనివ్వకూడదని చెప్పారు.
పెన్సిల్వేనియాలో ఏడు లక్షలకు పైగా
పెన్సిల్వేనియాలో తాను సుమారు ఏడు లక్షల ఓట్లను సాధించానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ.. తాను 90 వేలకు పైగా ఓట్లతో వెనుకబడి ఉన్నట్లు చెబుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లెక్కించాల్సిన ఓట్లు పూర్తయినప్పటికీ.. కౌంటింగ్ను ఇంకా, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని విమర్శించారు. తాము సాధించిన మెజారిీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొన్ని కీలక రాష్ట్రాల్లో కనిపించిందని, అక్రమాలు, కుట్రలతో అధికారాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.