యమడేంజర్గా భారత్: ప్రయాణాలు వద్దు.. టీకాతో కూడా ప్రయోజనం లేదు : అమెరికా ఆరోగ్యశాఖ
న్యూయార్క్ : అమెరికా నుంచి భారత్కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్కు వెళ్లకపోవడమే ఉత్తమం అని వారు పేర్కొన్నారు. ఇక తప్పని పరిస్థితులో వెళ్లాల్సి వస్తే మాత్రం రెండు డోసుల టీకా వేయించుకున్నాకే తగు జాగ్రత్తలతో భారత్కు వెళ్లాలని అమెరికా ఆరోగ్యశాఖ సూచించింది. ఇక భారత్ను నాల్గవ కేటగిరీలో చేర్చింది అమెరికా ఆరోగ్యశాఖ. అంటే కోవిడ్-19 అత్యంత తీవ్రంగా భారత్లో ఉందని చెబుతూ ఈ లెవెల్ 4 కేటగిరీ సూచిస్తుంది.
ప్రస్తుతం భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతోందని ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని హెచ్చరికలు జారీ చేసింది అమెరికా ఆరోగ్యశాఖ. పూర్తిగా టీకాలు తీసుకున్నప్పటికీ కరోనాబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరించింది.ఈ మేరకు కొన్ని గైడ్లైన్స్ను సైతం విడుదల చేసింది. భారత్లో ప్రస్తుతం కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చిందని అమెరికా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆదివారం రోజున రికార్డు స్థాయిలో 2.7 లక్షల పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్న వేళ ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూలు విధించారు.
ఓవైపు కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తుంటే మరోవైపు ఆక్సిజన్ కొరత కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు హాస్పిటల్స్లో బెడ్లు లేక పేషెంట్లు ఇబ్బంది పడటమే కాకుండా రెమిడెసివీర్లాంటి డ్రగ్స్ కూడా దొరక్క ప్రజలు ఇక్కట్లపాలవుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే వ్యాక్సిన్ కొరత కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ భారత్కు వెళ్లాలని భావిస్తే కోవిడ్ టీకాలు రెండు డోసులు వేసుకుని వెళ్లాలని అమెరికా ప్రయాణికులకు ఆ దేశ ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, గుంపుల్లో ఉండకూడదని, నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాలంటూ కొన్ని గైడ్లైన్స్ జారీ చేసింది.
మొత్తానికి భారత్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 2,59,170 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 1761 మంది మృతి చెందారు. దీంతో మరోసారి భారత్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి.