అమెరికా ఫెయిల్?: నేను రాకపోతే పరిస్థితి మారదన్న ట్రంఫ్
వాషింగ్టన్: అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్ధ పూర్తిగా విఫలమైందని, దీని ద్వారానే అమెరికా ఉగ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటుందని రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్ట్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓర్లాండో కాల్పుల ఘటన అనంతరం తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన ఒబామా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
'మీకు నిజం తెలియాలి. ఆమెరికాలోకి ఇస్లాం తీవ్రవాదం ఎలా వస్తుందనే దానిపై మనం నిజం మాట్లాడుకోవాలి. ఇమ్మిగ్రేషన్ ఫెయిల్ అవడం ద్వారానే మన దేశంలోకి ఇస్లాం తీవ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. తనఖీల్లో అధికారులు ఫెయిలయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారులు సరిగా పనిచేయడం లేదు. అయినా మన దేశాధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంటెలిజెన్స్ సర్వీసెస్ను వెనుకేసుకొస్తున్నారు.' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలోని ఓర్లాండోలో నైట్ క్లబ్పై మతీన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల ఘటన అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఘటనగా నిలిచింది. ఈ కాల్పుల ఘటనను ప్రపంచం దేశాలు ముక్త కంఠంతో ఖండించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంఫ్, హిల్లరీ క్లింటన్లు సైతం ఈ దాడిని ఖండించారు. ఈ కాల్పుల అనంతరం సోమవారం న్యూ హ్యాంప్ షైర్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ వెంటనే అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా ఓ తాత్కలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
తాను అధికారంలోకి వస్తే పరిస్థితి అంతా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానం దేశంలోకి ఎవరు అడుగుపెడుతున్నారో సరిగా చెప్పలేకపోతుందన్నారు. ఈ ఇమ్మిగ్రేషన్ విధానం మన పౌరులను రక్షించలేదని వ్యాఖ్యానించారు.
మన పాలనా యంత్రాంగం గట్టిగా పోటీ ఇవ్వలేకపోతుందని చెప్పిన ట్రంఫ్, ఈ పరిస్థితి మారాలని అమెరికన్లకు సూచించారు. తాను గనుక అధ్యక్షుడిగా కాలేకపోతే మరో నాలుగేళ్లపాటు కూడా ఈ అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ఏమాత్రం మార్పు ఉండదని తెలిపారు.
'ఇస్లాం తీవ్రవాదంపై అమెరిన్లలో మార్పు రావాలని, ఆ మార్పు ఇప్పుడే రావాలని ఆయన సూచించారు. ఓర్లాండో ఘటనలో 50మంది చనిపోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. కానీ, ఈ అంశంపై మనం చర్చించుకునేందుకు ఇప్పటికీ సిద్ధంగా లేము'ని అన్నారు.
'శాన్ బెర్నార్డియో ఘటన తర్వాత ముస్లింలను నిషేధించాలని నేను చెబితే అంతా నన్ను తిట్టారు. నవ్వారు.. ఇప్పుడు నేను కరెక్టని చాలా మంది అంటున్నారు. ఇప్పటికీ చెబుతున్నాను. ప్రస్తుతం ముస్లింల రాకపై తాత్కాలికంగా నిషేధం విధించి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
'ఇస్లాం తీవ్రవాదం నుంచి అమెరిక్లను రక్షించేది నేనే. నేను అధ్యక్షుడిని అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు చేస్తాను. ప్రపంచంలో తీవ్రవాదం ఛాయలు ఉన్న దేశాల ప్రజలను అమెరికాలోకి అనుమతించని విధంగా చట్టాలను రూపొందిస్తా.' అని ట్రంప్ అన్నారు.